-

సక్సెస్‌ అయితేనే మాట్లాడతారు: సందీప్‌ కిషన్‌

4 Mar, 2021 01:16 IST|Sakshi

‘‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా తర్వాత హాకీ క్రీడను ఎక్కువమంది ఇష్టపడతారా? అంటే అది నేను చెప్పలేను. ‘చెక్‌ దే’ సినిమా తర్వాత హాకీ గురించి, ‘ఒక్కడు’ సినిమా తర్వాత కబడ్డీ గురించి, ‘సై’ సినిమా సమయంలో రగ్బీ గురించి చెప్పుకున్నారు. కానీ ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’ సినిమా ద్వారా కొందరిలోనైనా ఓ ఆలోచన కలుగుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సందీప్‌ కిషన్‌ . డెన్నిస్‌ జీవన్‌  కనుకొలను దర్శకత్వంలో సందీప్, లావణ్యా త్రిపాఠీ జంటగా రూపొందిన చిత్రం ‘ఏ1 ఎక్స్‌ప్రెస్‌’. టీవీ విశ్వప్రసాద్, దయా వన్నెం, అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. సందీప్‌ కిషన్‌  చెప్పిన విశేషాలు...

► నా కెరీర్‌లో 25వ చిత్రం ఇది. కొత్త దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేశాను. కొత్త దర్శకుడు జీవన్‌ తో ఇలాంటి స్పోర్ట్స్‌ ఫిల్మ్‌ చేయడం రిస్క్‌ అనిపించలేదు. సినిమా విజయంపై నమ్మకంగా ఉన్నాం.

► స్పోర్ట్స్‌ బ్యాక్‌డ్రాప్‌ మూవీ అంటే ఎక్కువ కష్టపడాలి. ఈ సినిమా కోసం ఆరు నెలలు శిక్షణ తీసుకున్నాను. హాకీ ప్లేయర్స్‌ బాడీ లాంగ్వేజ్, స్టైలిష్‌ లుక్స్‌ కోసం మ్యాచ్‌లు చూశాను.

► ఏ రంగంలోనైనా ప్రతిభకు, కష్టానికి ఒక్కోసారి విలువ, గుర్తింపు ఉండవు. సక్సెస్‌ అయితేనే మాట్లాడతారు. కానీ మన వంతుగా మనం వంద శాతం కష్టపడాలి. ప్రొడక్షన్స్‌  అనేది క్రియేటివ్‌ జాబ్‌. ప్రస్తుతం నా ప్రొడక్షన్‌ లో ‘వివాహ భోజనంబు’ సినిమా చేస్తున్నాం. ‘రౌడీ బేబీ’, మహేశ్‌ కోనేరు నిర్మాణంలో ఒక సినిమా, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్‌లో మరో సినిమాలో పాత్రపోషణ చేస్తున్నాను.

మరిన్ని వార్తలు