సుశాంత్‌ కుటుంబానికి న్యాయం జరగాలి: రౌత్

14 Aug, 2020 13:06 IST|Sakshi

ముంబై: సుశాంత్‌ కేసులో తను చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవడంతో శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ స్పందించారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ తన కొడుకు లాంటివాడని, అతడి కుటుంబానికి న్యాయం జరగాలని పేర్కొన్నారు. సుశాంత్‌ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నారని అందుకే తండ్రితో, కుటుంబంతో సుశాంత్‌కు మంచి సంబంధాలు లేవని రౌత్‌ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీంతో సుశాంత్‌ బంధువు, బీజేపీ ఎమ్మెల్యే అయిన నీరజ్‌ కుమార్‌ సంజయ్‌ రౌత్‌కు నోటీసులు పంపారు. కేకే సింగ్‌ రెండో పెళ్లి అవాస్తవమని, అనవసర వ్యాఖ్యలు చేసిన రౌత్‌ 48 గంటల్లో బహిరంగంగా క్షమాపణలు చేప్పాలని లేకుంటే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. (సుశాంత్‌ తండ్రి రెండో పెళ్లిపై రౌత్‌ వ్యాఖ్యల రగడ)

దీనిపై స్పందించిన శివసేన ఎంపీ.. సుశాంత్‌ కేసులో తనకు తెలిసిందే చెప్పానని ఆయన పేర్కొన్నారు. తానేదైనా తప్పుగా మాట్లాడితే ఆ విషయాన్ని పరిశీలిస్తానని తెలిపారు. తనకు అందిన సమాచారం ప్రకారమే అలా మాట్లాడానని, సుశాంత్ కుటుంబం వారి వద్ద ఉన్న సమాచారం ఆధారంగా మాట్లాడుతున్నారని రౌత్‌ అన్నారు. సుశాంత్‌ తన కొడుకు లాంటి వాడని, బాలీవుడ్‌ తమ కుటుంబమని పేర్కొన్నారు. నటుడి కుటుంబంతో ఎలాంటి శత్రుత్వం లేదని, అతడి కుటుంబానికి న్యాయం జరగాలనే తాము కోరుకుంటున్నామన్నారు. సుశాంత్‌ ఆత్మహత్య వెనక ఉన్న కారణాలను బహిర్గతం చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. (సుశాంత్‌ కేసు: మనవడికి పవార్‌ మందలింపు)

సుశాంత్‌ కుటుంబ సభ్యులపై తనకు సానుభూతి ఉందని, వాస్తవాలు వెలుగు చూసే వరకు ఓపికతో ఉండాలని వారికి సూచించినట్లు తెలిపారు. తన వ్యాఖ్యలను తప్పుగా చిత్రీకరించారని, తనసలు బెదిరించలేదని స్పష్టం చేశారు. సుశాంత్‌ కేసు దర్యాప్తులో ముంబై పోలీసులపై నమ్మకం ఉంచాలని కోరారు. ఒకవేళ వారు సరిగా పనిచేయడం లేదని అనుకుంటే అప్పుడు సీబీఐను ఆశ్రయించాలని సంజయ్‌ రౌత్‌ అన్నారు. (‘సుశాంత్‌ సోదరి నన్ను వేధించారు’)

(ముగ్గురిపై దిశ తండ్రి ఫిర్యాదు)

మరిన్ని వార్తలు