Santosh Sobhan: నాకు దర్శకుడంటే దేవుడితో సమానం

12 Jan, 2023 18:43 IST|Sakshi

యంగ్‌ హీరో సంతోష్ శోభన్, కోలీవుడ్ హీరోయిన్‌ ప్రియ భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "కళ్యాణం కమనీయం". ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వం వహించగా, జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది. ఈ సందర్బంగా చిత్రానికి సంబంధించిన ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్‌లో చిత్రయూనిట్‌ సినీ విశేషాలు పంచుకుంది.

హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ "దర్శకుడికి, హీరోయిన్ ప్రియకి తెలుగులో ఇదే మొదటి సినిమా. చిరంజీవి, బాలకృష్ణగారి సినిమాలతో సంక్రాంతికి మళ్ళీ ఒక కళ వచ్చింది. వాళ్ళ సినిమాలతో పాటు మా సినిమాకి కూడా ఈ అవకాశం రావటం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. యూవీ క్రియేషన్స్ అనేది నా ఫ్యామిలీ, వాళ్ళెప్పుడూ నాకు వెన్నుదన్నుగా ఉంటారు. నాకు దర్శకుడు అంటే దేవుడితో సమానం. ఇప్పటివరకు చేసిన సినిమాల కంటే ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఈ సినిమాకి ఎంత క్రెడిట్ వచ్చినా అది మొత్తం అనిల్‌కే దక్కాలి. శివ పాత్రకి మొదటి ఆప్షన్ నేను కాదు అది ఎవరో మీరే అనిల్‌ను అడగాలి కానీ శృతి పాత్రకి ప్రియానే మొదటి ఆప్షన్" అన్నాడు.

హీరోయిన్ ప్రియ భవాని శంకర్ మాట్లాడుతూ "ఇది తెలుగులో నా మొదటి సినిమా. చాలా ఎక్సయిటింగ్ గా ఉంది అలాగే భయంగానూ ఉంది. ఈ సారి తెలుగులో మాట్లాడటానికి ట్రై చేస్తాను. సినిమాలో శృతి క్యారెక్టర్ ఎలాంటిదో నాది ఇంచుమించు అలాంటి క్యారెక్టరే" అన్నారు. దర్శకుడు అనిల్ కుమార్ మాట్లాడుతూ, "మనం జెన్యూన్‌గా ఒక కథ రాసుకుంటే యూనివర్స్ మొత్తం మనకి హెల్ప్ చేస్తుందని నేను నమ్ముతాను. ఈ కథ అలా రాసుకున్నదే. జీవితంలో నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు కళ్యాణం కమనీయంలో ఉన్నాయి. నా ఫ్రెండ్ వేదవ్యాస్ నుంచి ప్రారంభమయిన ఈ కథ, యూవీ వరకు వచ్చింది, యూవీ క్రియేషన్స్ వచ్చాక ఇక వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ అవసరం రాలేదు" అన్నారు.

చదవండి: తండ్రి చనిపోయిన రెండు రోజులకే షూటింగ్‌కు: చిరంజీవి
వీరసింహారెడ్డి: థియేటర్‌లో పూజారి మాస్‌ డ్యాన్స్‌

మరిన్ని వార్తలు