‘వకీల్ సాబ్’ నుంచి సత్యమేవ జయతే పాట రిలీజ్‌

3 Mar, 2021 19:11 IST|Sakshi

పవర్‌స్టార్‌ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తోన్న ‘వకీల్‌సాబ్’‌ చిత్రం నుంచి రెండో పాట నేడు(మార్చి3) విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన ‘సత్యమేవ జయతే’ సాంగ్‌ను బుధవారం చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. ‘జనజనజన జనగణమున కలగలిసిన జనం మనిషి రా.. ’ అంటూ ప్రారంభమైన ఈ పాట పవన్‌ అభిమానులనే కాకుండా సాధారణ ప్రేక్షకుడిని సైతం ఆకట్టుకుంటుంది. థమన్‌ ఎనర్జిటిక్‌ బీట్‌తో సంగీతం అందించగా.. శంకర్‌ మహదేవన్‌, పృథ్వీ చంద్ర కలిసి పాడారు. ఇందులోని బలమైన లిరిక్స్‌ పాటను మరోస్థాయికి తీసుకెళ్లాయి. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. కాగా 2020 మార్చి 8న మహిళా దినోత్సవం కానుకగా మగువ మగువ పాట విడుదలైంది. సరిగ్గా మొదటి పాట విడుదలైన ఏడాదికి రెండో పాట విడుదలవ్వడం విశేషం. మగువ పాటకు విశేష స్పందన లభించిన విషయం తెలిసిందే. మరి ఈ పాట జనాలకు ఎంత వరకు రీచ్‌ అవుతోంది వేచి చూడాలి.

బాలీవుడ్‌లో హిట్‌ సాధించిన పింక్‌ చిత్రాన్ని తెలుగులో వకీల్‌సాబ్‌గా రీమేక్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. దీనిని వేణు శ్రీరామ్‌ తెరకెక్కిస్తున్నారు. పింక్'లో అమితాబ్ బచ్చన్ పోషించిన పాత్రను 'వకీల్ సాబ్'లో పవన్ కల్యాణ్ పోషిస్తుండడంతో సినిమాకు భారీ హైప్ క్రియెట్‌ అయ్యింది. అలాగే మూడేళ్ల గ్యాప్‌ తర్వాత పవన్ నుంచి వస్తున్న తొలి సినిమా కావడంతో అభిమానులతో పాటు ఇండస్ట్రీ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల కానుంది. దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

చదవండి:

పవన్‌ సినిమాకు నో చెప్పిన సాయి పల్లవి!

నాని ‘వీ’ చిత్రంపై కోర్టుకెక్కిన నటి..

మరిన్ని వార్తలు