Senior Actor Nassar: హోటల్‌లో పని చేశాను, అది తెలిసి చిరంజీవి బాధపడ్డాడు, అంతేకాదు..

4 Jun, 2022 16:48 IST|Sakshi

పాత్ర ఏదైనా సరే, దానికి ప్రాణం పోసే నటుడు నాజర్‌. క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నాజర్‌ తాజాగా చిరంజీవితో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నాడు. ఓ మీడియాకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'ఓ రోజు ఫిల్మ్‌ చాంబర్‌లో షూటింగ్‌ జరుగుతోంది. నేను హోటల్‌ నుంచి అక్కడికి వెళ్లి చిరంజీవి యాక్టింగ్‌ చూశాను. అక్కడి నుంచి తిరిగి వెళ్దామనుకునేలోపు చిరంజీవి చూసి నన్ను పిలిచారు. ఏంట్రా? ఏం చేస్తున్నావ్‌? అని అడిగారు. నేను హోటల్‌లో పని చేస్తున్నానని చెప్పాను. దానికాయన అదేంట్రా? ఇంత మంచి నటుడివి, నువ్వు హోటల్‌లో పని చేయడమేంటి? నెక్స్ట్‌ డే నువ్వు నన్ను కలవాలి అన్నాడు. కానీ నేను వెళ్లలేదు. ఆ సమయంలో నాకు సినిమా మీద పెద్దగా నమ్మకం లేదు. ఎందుకంటే నెల తిరిగేకల్లా చేతికి డబ్బులిచ్చే ఉద్యోగం బెటర్‌ అనుకున్నాను. అందుకే సినిమాను సెకండరీగా పెట్టాను.

తర్వాత చిరంజీవి పెద్ద స్టార్‌ అయ్యాడు. బాలచందర్‌ గారి వల్ల నేను విలన్‌ అయ్యాను. కానీ మేమిద్దరం కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. మేము ఒకరి నుంచి మరొకరం ఏదీ ఆశించము. అయితే ఖైదీ నంబర్‌ 150లో ఇద్దరం కలిశాం. అప్పుడు చిరంజీవి.. నేను రికమెండ్‌ చేస్తే నీకు నచ్చదని తెలుసు అంటూనే మనం కలవడానికి ఇంత సమయం పట్టిందా? అన్నాడు. అప్పుడు మా కళ్లలో నీళ్లు తిరిగాయి.

అప్పట్లో చెంగల్పట్టు నుంచి 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి యాక్టింగ్‌ స్కూల్‌కు వచ్చేవాడిని. ఉదయం ఆరు గంటలకే లంచ్‌ బాక్స్‌ తీసుకుని వచ్చేవాడిని. అంత పొద్దున అమ్మ అన్నం మాత్రమే వండేది. చిరంజీవి, ఇతర స్నేహితులు ఆంధ్ర మెస్‌ నుంచి భోజనాలు తెచ్చుకునేవారు. నేను అన్నం మాత్రమే తెచ్చుకోవడాన్ని ఓసారి చిరంజీవి చూశాడు. రేపటినుంచి మీ అమ్మను వంట చేయమని బాధపెట్టావంటే చంపేస్తా, ఇకపై మాతోనే కలిసి తినాలి అని చెప్పాడు. చిరంజీవిది చాలా మంచి మనసు' అని చెప్పుకొచ్చాడు నాజర్‌.

చదవండి: విక్రమ్‌ ఫస్ట్‌డే కలెక్షన్స్‌ ఎంతంటే..
కమల్‌ హాసన్‌ 'విక్రమ్‌' ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడంటే?

మరిన్ని వార్తలు