సీనియర్ నటి జెమినీ సరస్వతి ఆదివారం చెన్నైలో కన్నుమూశారు. ఈమె వయస్సు 94 ఏళ్లు. కారైకుడికి చెందిన జెమినీ సరస్వతి 5వ తరగతి చదువుతున్న వయసులోనే నాట్యంపై ఆసక్తితో, సినిమాల్లో నటించాలనే ఆశతో చెన్నైకి వచ్చారు. చంద్రలేఖ చిత్రం ద్వారా డాన్సర్గా పరిచయమయ్యారు. ఈమె అసలు పేరు సరస్వతి. జెమినీ సంస్థ నిర్మించిన చంద్రలేఖ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేయడంతో జెమినీ సరస్వతిగా గుర్తింపు పొందారు.
ఆ తర్వాత కాదల్ పడుత్తుమ్ పాడు చిత్రంతో నటిగా పరిచయం అయ్యారు. శివాజీ గణేషన్, రజినీకాంత్, కమలహాసన్ వంటి ప్రముఖ నటులతో పలు చిత్రాల్లో నటించారు. 400 చిత్రాల్లో, 1000 పైగా నాటకాల్లో ఆమె వివిధ పాత్రలతో అలరించారు. కుటుంబ సభ్యులతో నివసిస్తున్న ఆమె.. ఇటీవల శ్వాసకోస సంబంధిత సమస్య అనారోగ్యానికి గురయ్యారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. ఈమెకు దక్షిణామూర్తి, సెల్వరాజ్ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. సరస్వతి మరణానికి పలువురు సినీ ప్రముఖు లు సంతాపం వ్యక్తం చేశారు.