Shantipriya: ప్రేమించి పెళ్లి చేసుకున్నా, వివాహం తర్వాత సినిమాలకు దూరం.. అంతలోనే!

22 Feb, 2023 17:07 IST|Sakshi

ప్రముఖ నటి భానుప్రియ చెల్లెలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది శాంతిప్రియ. తనదైన నటనతో కొద్దికాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. మహర్షి చిత్రంతో తెలుగు తెరపై అడుగుపెట్టిన ఆమె ఎన్నో సినిమాల్లో నటించింది. మహర్షి మూవీలో మాట రాని మౌనమిది.. పాటలో ఆమె పలికించిన హావభావాలు అందరినీ కట్టిపడేశాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె తాజా ఇంటర్వ్యూలో తన కెరీర్‌ విశేషాలను, వ్యక్తిగత విషయాలను పంచుకుంది. 'సౌత్‌లోనే కాకుండా హిందీలో కూడా నటించాను. బాలీవుడ్‌లో ఏడాదిన్నర కాలంలోనే ఐదారు సినిమాలు చేశా. ఆ సమయంలో సిద్దార్థ్‌ రాయ్‌తో ప్రేమలో పడ్డా, ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. పెళ్లి తర్వాత సినిమాలు చేయకూడదని ఎవరూ చెప్పలేదు, కానీ నేనే ఇక ఇల్లాలిగా ఉండిపోదామనుకున్నాను.

భర్త చనిపోయాక నేనొక షాక్‌లో ఉండిపోయాను. ముంబైలో నాకంటూ ఎవరూ లేరు, దీంతో నేను ఇల్లు దాటి బయటకు రాలేదు. ఆ బాధలో నుంచి బయటకు రావడానికి దాదాపు రెండేళ్లు పట్టింది. అమ్మ, అక్క, అన్నయ్య, నా పిల్లలు నాకు అండగా నిలబడ్డారు. చెన్నై వచ్చేయమన్నారు, కానీ నేను నా కాళ్ల మీద నేను నిలబడాలనుకున్నాను. అమ్మ కూడా సింగిల్‌ పేరెంట్‌ కావడంతో తనను చూసి ధైర్యంగా ఉండటం నేర్చుకున్నాను. ఈ మధ్యే ధారావి బ్యాంక్‌ అనే ఓటీటీ సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చాను. వెంకటేశ్‌తో ఒక్క సినిమా అయినా చేయాలనుకున్నాను, కానీ అది కుదరలేదు' అని చెప్పుకొచ్చింది శాంతిప్రియ.

మరిన్ని వార్తలు