Director Sagar : ప్రముఖ సీనియర్‌ దర్శకుడు సాగర్‌ కన్నుమూత

2 Feb, 2023 09:09 IST|Sakshi

తెలుగు చలన చిత్ర పరిశ్రమ మరో విషాదంలో కూరుకుంది. 73 ఏళ్ల ప్రముఖ సీనియర్‌ దర్శకుడు సాగర్‌(విద్యాసాగర్‌ రెడ్డి) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఈ ఉదయం గం. 6.03ని.లకు తుదిశ్వాస విడిచారు.

1983లో నరేష్-విజయశాంతిల ‘రాకాసిలోయ’సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన నటశేఖర కృష్ణతో తీసిన ‘అమ్మదొంగా’ చిత్రం మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. భానుచందర్, లిజీలతో ‘స్టూవర్ట్‌పురం దొంగలు, ఓసినా మరదలా, ఖైదీ బ్రదర్స్‌, యాక్షన్‌ నెంబర్‌ 1 సహా సుమారు 40 చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. ఆయన తెరకెక్కించిన 'రామసక్కనోడు' చిత్రానికి మూడు నంది పురస్కారాలు లభించాయి.

అంతేకాదు ఈయన తెలుగు సినిమా దర్శకులు సంఘానికి మూడు సార్లు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. శీనువైట్ల, వి.వి.వినాయక్ , శ్రీనువైట్ల, రవికుమార్ చౌదరి లాంటి ఎందరో దర్శకులు ఈయన శిష్యులే. సాగర్‌ మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు