సీరియల్స్‌లో బిజీ ఆర్టిస్టుగా శ్రావణి.. అలా అవకాశం

4 Oct, 2022 11:55 IST|Sakshi

శ్రీకాకుళం (టెక్కలి): కార్తీకదీపం సీరియల్‌లో తులసిగా..గీతాగోవిందంలో జయమ్మగా..గుప్పెడంత మనసులో ధరణిగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు.. సుమారు 14 టీవీ సీరియల్స్, మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్‌ సుబ్బలక్ష్మి వెబ్‌ సిరీస్‌లో నటిగా, అమమ్మగారిల్లు, పేపర్‌బాయ్‌ సినిమాల్లో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ వర్ధమాన టీవీ సీరియల్‌ నటి తాండ్ర శ్రావణి అలియాస్‌ సీతామహాలక్ష్మి ఇటీవల టెక్కలి వచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్న ఈమె స్వస్థలం కోటబొమ్మాళి మండలం పులిబంద గ్రామం. టెక్కలిలోని బంధువుల ఇంటికి వచ్చిన ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. 

మారుమూల ప్రాంతానికి చెందిన తనను టీవీ సీరియల్స్‌ అభిమానులు ఎంతగానో అభిమానిస్తూ ఆదరిస్తున్నారని చెప్పారు.2వ తరగతి చదువుతున్నప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్‌ వలస వెళ్లామన్నారు. 2011లో హైదరాబాద్‌లో సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ప్రారోంభోత్సవంలో భాగంగా తనకు నటిగా అవకాశం వచ్చిందన్నారు. మొదట తమిళంలో కడాసి బెంచ్‌ అనే సీరియల్‌లో నటించినట్లు తెలిపారు.  

తర్వాత మొగలిరేకులు, ఒకరికొకరు, అభిషేకం , కార్తీకదీపం, గోరింటాకు, గీతాగోవిందం, గుప్పెడంత మనసు, ఆడదే ఆధారం, పౌర్ణమి, అగ్నిపూలు తదితర సీరియల్స్‌లో అనేక  పాత్రలు పోషించినట్లు వివరించారు. వీటితో పాటు మంచు లక్ష్మి నిర్మాణంలో మిసెస్‌ సుబ్బలక్ష్మి అనే వెబ్‌ సిరీస్‌ చేసినట్లు పేర్కొన్నారు. వీటితో పాటు హైదరాబాద్‌లో అనాథ పిల్లలకు అండగా సామాజిక కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. 

మరిన్ని వార్తలు