Shahid Kapoor Jersey Movie Makers Clarity On OTT Release: బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తాజాగా నటించిన చిత్రం ‘జెర్సీ’.నెచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ చిత్రాన్ని అదే పేరుతో హిందీలో తెరకెక్కించారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. క్రికెట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించాడు. ఇందులో షాహిద్కు జోడీగా మృణాల్ ఠాకూర్ నటించింది. పంకజ్ కపూర్, శిశిర్ శర్మ,శరద్ కేల్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. అయితే ఇప్పటికే పలుమార్లు వాయిదా వేస్తూ వచ్చిన ఈ చిత్రం విడుదల తేదీని డిసెంబర్ 31, 2021కి ఖరారు చేసిన సంగతి తెలిసిందే. ఇక మూవీ విడుదల మరోసారి వాయిదా పడుతున్నట్లు ఇటీవల వార్తలు వినిపించాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీ విడుదలకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతోంది. జెర్సీని దిల్ రాజు నేరుగా ఓటీటీలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు తెలిసింది. డిసెంబర్ 31 నుంచి కొన్ని ప్రాంతాల్లో నైట్ కర్ఫ్యూ ఉన్న నేపథ్యంలో ఈ మూవీ థియేటర్లో విడుదల చేయడం కంటే ఓటీటీ రిలీజ్ చేయడం బెటర్ ఆయన అభిప్రాయడుతున్నాడని, ఇందుకోసం ఇప్పటికే ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్తో దిల్ రాజు చర్చలు జరపగా మంచి ఫ్యాన్సీ రేటుకు ఒప్పందం కూడా కుదిరినట్లు జోరుగా ప్రచారం జరిగింది.
కానీ ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు షాహిద్ నిరాకరించాడని, కావాలంటే తన పారితోషికంలో 31 కోట్ల రూపాయలను తగ్గించుకుంటానని నిర్మాత దిల్ రాజుకు చెప్పినట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో షాహిద్, దిల్ రాజు మధ్య విభేదాలు కూడా తలెత్తినట్లు ప్రచారం జరిగింది. తాజాగా దీనిపై మేకర్స్ స్పందించారు. జెర్సీ మూవీని ఓటీటీలో రిలీజ్ చేయడం లేదని వారు స్పష్టం చేశారు. తాజా కోవిడ్ నిబంధనల నేపథ్యంలో మూవీని వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. అంతేగాక మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్తో పాటు విడుదల తేదీని త్వరలోనే ప్రకటిస్తామని, అప్పటి వరకు అందరూ సేఫ్గా ఉండాలంటూ మేకర్స్ ప్రకటన ఇచ్చారు.