Shekhar Suman: తాచుపాము కంటే డేంజర్‌.. మిమ్మల్ని అణచివేసి, అంతం చేసేదాకా వదలరు..

31 Mar, 2023 17:49 IST|Sakshi

బాలీవుడ్‌లో కొందరి రాజకీయాలను తట్టుకోలేకే హాలీవుడ్‌కు షిఫ్ట్‌ అయ్యానంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది ప్రియాంక చోప్రా. స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్న సమయంలో తనకు అవకాశాలు రాకుండా చేసి ఓ మూలకు నెట్టేయడానికి ఓ గ్రూప్‌ ఏర్పాటైందని పేర్కొంది. ఈ పొలిటికల్‌ గేమ్స్‌ ఆడలేకే హాలీవుడ్‌కు మకాం మార్చానంది. ఈ వ్యాఖ్యలు బీటౌన్‌ను షేక్‌ చేస్తున్నాయి. ఈ క్రమంలో మరో నటుడు శేఖర్‌ సుమన్‌ సైతం బాలీవుడ్‌లో రాజకీయాలు ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'ప్రియాంక వ్యాఖ్యలు నన్నేమీ షాక్‌కు గురి చేయలేదు. ఇండస్ట్రీలో ఎలాంటి కుళ్లు రాజకీయాలుంటాయో అందరికీ తెలుసు. మిమ్మల్ని అణిచివేసి, అంతం చేసేవరకు వదలరు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ విషయంలో జరిగింది ఇదే! ఇంకా చాలామందికి జరిగింది. దాన్ని తట్టుకోవాలి, లేదంటే వదిలేయాలి. ప్రియాంక బాలీవుడ్‌ను వదిలి వెళ్లిపోవాలనుకుంది. నిజంగా తను మంచి పని చేసింది. హాలీవుడ్‌లో భారత్‌ తరపునుంచి గ్లోబల్‌ ఐకాన్‌గా నిలబడింది' అని ట్వీట్‌ చేశాడు.

మరో ట్వీట్‌లో.. 'సినీ ఇండస్ట్రీలో ఉన్న ఓ నలుగురు వ్యక్తులు నాకు, నా కొడుకు అధ్యాయన్‌కు అవకాశాలు రాకుండా చేశారు. మాకు వ్యతిరేకంగా పని చేసి ఎన్నో ప్రాజెక్టుల నుంచి తప్పించారు. మమ్మల్ని ఇండస్ట్రీలో లేకుండా చేయాలని చూశారు. ఈ గ్యాంగ్‌స్టర్లు తాచుపాము కంటే కూడా ప్రమాదకరమైనవాళ్లు. కానీ అసలు నిజమేంటంటే.. వాళ్లు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మమ్మల్ని ఆపలేరు' అని రాసుకొచ్చాడు.

దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. 'అధ్యాయన్‌ మంచి నటుడు.. ఓటీటీ మాధ్యమాల ద్వారా అయినా తన ప్రతిభ నిరూపించుకోగలడు.. కానీ శేఖర్‌ సర్‌ చాలా గ్రేట్‌. ఆ రోజుల్లో ఓటీటీ వంటి మాధ్యమాలు లేవు. అయినా కష్టపడి తనకంటూ ఓ ఇమేజ్‌ తెచ్చుకున్నాడు', 'మీలాంటి లెజెండ్‌ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారంటే బాధగా ఉంది' అని కామెంట్లు చేస్తున్నారు. కాగా శేఖర్‌ సుమన్‌.. భూమి, హార్ట్‌లెస్‌, చలో, రణ్‌భూమి, తేరే బినా క్యా జీనా, వో ఫిర్‌ ఆయేగి, సంసార్‌, ఉత్సవ్‌, నాచే మయూరి వంటి సినిమాల్లో నటించాడు. బుల్లితెరపై పలు షోలకు జడ్జిగా, వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు.

మరిన్ని వార్తలు