Shershaah Movie: ‘షేర్షా’ డైలాగులు అదుర్స్‌.. జయహో అంటున్న ఫ్యాన్స్‌

20 Aug, 2021 17:43 IST|Sakshi

సాక్షి,ముంబై: కార్గిల్ యుద్ధ వీరుడు కెప్టెన్ విక్రమ్ బాత్రా జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘షేర్షా’ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. 75 వసంతాల స్వాతంత్ర్య దినోత్సవాల కాలంలో విడుదలైన ఈ మూవీలో ముఖ్యమైన సన్నివేశాలు, డైలాగులు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. కార్గిల్‌ యుద్ధంలో దేశ రక్షణ కోసం అమరుడైన  కెప్టెన్‌ విక్రమ్ బాత్రా పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర నటన, ఉద్వేగ సన్నిశాల డైలాగ్స్‌తో యువ ఫ్యాన్స్‌ ఫిదా అవుతున్నారు. జయహో అంటున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ అందుబాటులో ఉంది. 

‘‘ఒక్కసారి సైనికుడిగా ఉంటే ఇక జీవితాతం అతడు  సైనికుడే’’ 
‘‘అయితే జెండా చేత బూని వస్తా.. లేదంటే త్రివర్ణ పతాకం చుట్టుకొని వస్తా.. కచ్చితంగా తిరిగి రావడం మాత్రం  ఖాయం.’’
సహచరుడిని కోల్పోయిన తరుణంలో నీళ్లు నిండిన కళ్లతో  కెప్టెన్ బాత్రా తన తోటి  జవాన్లతో ఇలా అంటాడు.. "ఏ వార్‌ బడీ కుత్తీ  ఛీజ్ హై యార్" 

యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో  ‘ఏ దిల్‌ మాంగే మోర్‌’ అంటూ నినదిస్తాడు.

చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలని కలలు కన్న విక్రమ్ భాత్రా యుద్ధంలో విజయం సాధించిన ఉద్వేగభరిత సన్నివేశంలో ‘ఏ దిల్‌ మాంగే మోర్‌’ అంటాడు. సాధారణ పౌరుడి జీవితంలో అనుకున్నది సాధించడం వేరు...కానీ ఒక సైనికుడిగా దేశ రక్షణ పోరాటంలో నిర్దేశిత మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఉద్వేగపూరిత సన్నిశంలో ఈ డైలాగ్‌ మరింత ఎమోషనల్‌గా ఉంటుంది. 

దీంతోపాటు ప్రతి విజయవంతమైన పురుషుడి వెనుక ఒక మహిళ ఉంటుందన్నట్టుగా కెప్టెన్ విక్రమ్ బాత్రా అతని స్నేహితురాలు డింపుల్‌ చీమా అందించిన ఉత్సాహాన్ని, ధైర్యాన్నికూడా షేర్షా బాగా హైలైట్‌ చేసింది. వీరి పెళ్లికి డింపుల్ తండ్రి అడ్డుపడ్డ సన్నివేశం, ఆర్మీలో చేరాలనే బాత్రా కల కోసం అందించిన ప్రోత్సాహంతోపాటు, ఆమె తెగువకు, ప్రేమకు సెల్యూట్  చేస్తుందీ సినిమా.  

నరనరాన దేశభక్తిని నింపుకున్న వీరజవాన్‌ విక్రమ్ పాత్రలో సిద్దార్థ్ మల్హోత్ర ఫుల్‌మార్క్‌లు కొట్టేయగా, విక్రమ్ ప్రేయసి డింపుల్ క్యారెక్టర్‌లో కియారా అద్వానీ అటు అందంతో ఆకట్టుకోవడంతోపాటు ఇటు తెగువ, ధైర్యం ఉన్న మహిళగా అభినయంలోనూ జీవించింది. అలాగే కెప్టెన్ సంజీవ్‌గా శివ్ పండిట్, మేజర్ అజయ్ సింగ్‌గా నికితిన్ ధీర్, విక్రమ్ స్నేహితుడు సన్నీ పాత్రలో సాహిల్ వైద్ ఇలా అందరూ తమ నటనతో ఆకట్టుకున్నారు.

మరిన్ని వార్తలు