బుల్లితెర నటి శిఖా సింగ్ అనారోగ్యంతో సతమతమవుతోంది. రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేకపోతోంది. తన అనారోగ్యం గురించి నటి మాట్లాడుతూ.. 'రెండు నెలల క్రితం నాకు స్కిన్ అలర్జీ వచ్చింది. ఆస్పత్రికి వెళ్తే డాక్టర్ మందులు రాసిచ్చారు. కానీ ఒకటీ రెండు రోజుల్లోనే నా పరిస్థితి మరింత దిగజారింది. డాక్టర్లు అన్ని టెస్టులు చేసినా ఏమీ నిర్ధారణ కాలేదు. అంతా బానే ఉందని చెప్పారు. కానీ నేను ఏమీ తినలేకపోతున్నాను.
కేవలం తేలికపాటి ఆహారం మాత్రమే తీసుకోగలుగుతున్నా. ఫిబ్రవరి 7న నా బర్త్డే ఉండటంతో నైరోబీ ట్రిప్కు వెళ్లాం. దురదృష్టవశాత్తూ బాగానే ఉన్నాను అనుకునేలోపే మళ్లీ ఆస్పత్రిపాలు కావాల్సి వచ్చింది. వెంటనే ఇంటికి తిరిగొచ్చేశాం. అప్పటినుంచి రెస్ట్ తీసుకుంటున్నా. మరోవైపు నా భర్త కరణ్ పైలట్ కావడంతో అతడు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తోంది. డాక్టర్లు కూడా ఎందుకు అనారోగ్యానికి గురయ్యానో సరిగా గుర్తించలేకపోవడటంతో నాకెంతో ఆందోళనగా ఉంది. ఎందుకంటే నేను అంతకుముందులా సాధారణ ఆహారం తీసుకోలేకపోతున్నాను.
ఒక్కదాన్నే ఇంట్లో ఉండిపోవడంతో ఒంటరిగా అనిపిస్తోంది. నా కూతురు అలైనా ఏడుపుముఖంతో మమ్మా.. నీకు ఏమైంది? అని అడుగుతుంటే ఎంతో బాధగా ఉంది. త్వరగా కోలుకుకోవాలని ఉంది' అని చెప్పుకొచ్చింది నటి. శిఖా సింగ్ యాక్టింగ్ విషయానికి వస్తే.. లెఫ్ట్ రైట్ లెఫ్ట్, సాసురల్ సిమర్కా, మహాభారత్, కుంకుమ్ భాగ్య, ప్యార్ కో హో జానే దో, కుండలీ భాగ్య, నాగిని 6 వంటి పలు సీరియల్స్లో నటించింది.