శిల్పా శెట్టి కుటుంబ సభ్యులకు, పనివారికి కరోనా

7 May, 2021 17:10 IST|Sakshi

తన కుటుంబ సభ్యులంతా కరోనా బారిన పడినట్లు బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి సోషల్‌ మీడియా వేదిక వెల్లడించింది. ‘గత పది రోజులుగా మా కుటుంబం క్లిష్ట పరిస్థితిల్లో ఉంది. మా అత్తమామ, మా అమ్మ, చివరిగా నా భర్త రాజ్‌ కరోనా బారిన పడ్డారు. వారంత  ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. నాకు నెగిటివ్‌గా తేలింది. డాక్టర్ల సలహా మేరకు వారంత క్వారంటైన్‌ గైడ్‌లైన్‌ పాటిస్తూ చికిత్స తీసుకుంటున్నారు. అలాగే మా ఇంటి పనివాళ్లలోని ఇద్దరికి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారు కూడా ఐసోలేషన్‌కు వెళ్లారు. దేవుడు దయ వల్ల అందరూ కొలుకుంటున్నారు’ అంటూ ఆమె ఓ ప్రకటన విడుదల చేసింది.

అలాగే ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్న కుటుంబ సభ్యులంతా కోవిడ్‌ ప్రొటోకాల్‌ పాటిస్తూ అన్ని విధాల జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారని, ఇందుకు సహకరించిన ముంబై మున్సిపాలిటీ కమిషన్‌(బీఎంసీ), అధికారులకు శిల్పా ధన్యవాదాలు తెలిపింది. అభిమానులను ఉద్దేశిస్తూ.. ‘మీ అందరి ప్రేమ, మద్దతకు కృతజ్ఞతలు. మా కోసం ప్రార్థించిన వారందరికి రుణ పడి ఉన్నాం. అలాగే మీ ప్రార్థనలను కొనసాగిస్తారని ఆశిస్తున్నా’ అని పేర్కొంది. ఇక ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని, బయటకు వెళ్లేటప్పుము మాస్క్‌ ధరించడం, శానిటైజర్‌ వాడడం తప్పసరి చేసుకొండని సూచించింది. కోవిడ్‌ పాజిటివ్‌, నెగిటివ్‌ అయినా ప్రతి ఒక్కరూ మానసికంగా పాజిటివ్‌గా ఉండాలంటూ సందేశం ఇచ్చింది. కాగా శిల్పా శెట్టి-రాజ్‌ కుంద్రా దంపతులకు 8 ఏళ్ల కుమారుడు, ఏడాది కూతురు ఉన్న సంగతి తెలిసిందే.

A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty)

మరిన్ని వార్తలు