స్టార్ట్‌..కెమెరా..యాక్షన్‌ : వరుసగా షూటింగులు

13 Jul, 2021 00:28 IST|Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమలో సోమవారం ‘యాక్షన్‌.. స్టార్ట్‌’ అంటూ షూటింగ్స్‌ సందడి నెలకొంది.  కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా ఆగిపోయిన చిత్రాలతో పాటు కొత్త సినిమాల షూటింగ్స్‌ కూడా మొదలయ్యాయి. అఖిల్‌ ‘ఏజెంట్‌’ లుక్‌ విడుదల చేసి, షూటింగ్‌ ఆరంభించారు. రవితేజ ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’ లుక్‌ని విడుదల చేయడంతో పాటు షూటింగ్‌ షురూ చేశారు. ఇక   మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’, బాలకృష్ణ ‘అఖండ’ చిత్రాల షూటింగ్‌ పునః ప్రారంభమైంది. రామ్‌ హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం షూటింగ్‌ కూడా ఆరంభమైంది.

► అఖిల్‌ హీరోగా సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఏజెంట్‌’. ఈ సినిమాతో సాక్షీ వైద్య హీరోయిన్‌గా పరిచయమవుతున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, సరెండర్‌–2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ సందర్భంగా అఖిల్‌ కొత్త పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు. ‘‘స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ‘కిక్, రేసుగుర్రం’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌ తర్వాత డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి, రచయిత వక్కంతం వంశీ కాంబినేషన్‌లో ‘ఏజెంట్‌’ రూపొందుతోంది’’ అని చిత్రబృందం  పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాతలు: అజయ్‌ సుంకర, పత్తి దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కిషోర్‌ గరికిపాటి.

► రవితేజ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి ‘రామారావు: ఆన్‌ డ్యూటీ’ అనే టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ చిత్రానికి శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్నారు. దివ్యాంశా కౌశిక్‌ కథానాయిక. సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ‘‘వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక యూనిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ జరుగుతోంది. రవితేజ, దివ్యాంశా కౌశిక్, ఇతర తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి.

► మహేశ్‌ బాబు హీరోగా పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఇందులో కీర్తీ సురేష్‌ హీరోయిన్‌. ఈ చిత్రానికి లైన్‌ ప్రొడ్యూసర్‌: రాజ్‌ కుమార్, సీఈఓ: చెర్రీ.

► బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా తెరకెక్కుతోంది. మిర్యాల రవీందర్‌ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్‌ ప్రారంభమైంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్, శ్రీకాంత్‌ ముఖ్య పాత్రధారి.

► రామ్‌ హీరోగా లింగుసామి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ సినిమాలో కృతీ శెట్టి హీరోయిన్‌. ఈ చిత్రానికి సమర్పణ: పవన్‌ కుమార్‌.

మరిన్ని వార్తలు