కిలాడీ లేడీ ఎవరు?

29 Aug, 2020 01:43 IST|Sakshi
శ్రియ, ‌ప్రియమణి

హిందీలో ఘనవిజయం సాధించిన ‘అంధాధూన్‌’ తెలుగులో రీమేక్‌ కాబోతోందనే వార్తలు వచ్చినప్పటి నుండి ఒకటే ప్రశ్న – ‘హిందీలో టబు చేసిన పాత్ర ఎవరు చేస్తారు?’ అని. ఆయుష్మాన్‌ ఖురానా, టబు, రాధికా ఆప్టే ముఖ్య పాత్రల్లో శ్రీరామ్‌ రాఘవన్‌ దర్శకత్వం వహించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘అంధాధూన్‌’. నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెలుగులో ఈ చిత్రాన్ని రీమేక్‌ చేయనున్నారు. నభా నటేష్‌ హీరోయిన్‌. నితిన్‌ సొంత బ్యానర్‌ శ్రేష్ట మూవీస్‌పై సుధాకర్‌ రెడ్డి నిర్మించనున్నారు.

అయితే మొదటి నుంచి టబు పోషించిన పాత్రకు పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ఈ పాత్రకు అంత స్పెషాలిటీ ఏంటీ అంటే? నెగటివ్‌ షేడ్స్‌ ఉండటమే. కథను మలుపు తిప్పే కిలాడీ పాత్ర కావడమే అందుకు ప్రధాన కారణం. మొదట టబూయే ఆ పాత్ర మళ్లీ చేస్తారు అనే వార్త వచ్చింది. తర్వాత నయనతార ఆ పాత్ర చేయబోతున్నారని ఓ వార్త. తాజాగా ఈ పాత్రకు ప్రియమణి లేదా శ్రియను తీసుకోవాలనుకుంటున్నారట చిత్రబృందం. మరి ఈ కిలాడీ లేడీ పాత్ర చేసే ఛాన్స్‌ ఎవరికొస్తుందో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు