మూడోసారి పవర్‌స్టార్‌తో జతకట్టనున్న శృతి హాసన్

7 Nov, 2020 16:04 IST|Sakshi

శృతి హాసన్‌ తెలుగులో చేసిన ఆఖరి చిత్రం ‘కాటమరాయుడు’. ఆ తర్వాత కొన్ని రోజులకు బాలీవుడ్‌లో ‘బెహెన్‌ హోగీ తేరీ’ చిత్రంలో తలుక్కుమన్నారు. అంతే.. తర్వాత కొన్ని రోజుల వరకు ఆమె జాడే మాయం. ఈ మూడు సంవత్సరాలు ఆమె ఏ భాషలోనూ, ఏ సినిమాలోనూ కనిపించలేదు. పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్‌బై చెప్పేస్తుందన్న పుకార్లు కూడా వినిపించాయి. కానీ ఇన్ని రోజుల గ్యాప్‌ తర్వాత మళ్లీ తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు శృతి.

జీ-5లో రిలీజ్‌ అయిన ‘యారా’ సినిమాతో బాలీవుడ్‌కు మళ్లీ హాయ్‌ చెప్పారు. ఇటీవల అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల అయిన తమిళ చిత్రం ‘పుత్తమ్‌ పుదు కలయ్‌’లో ఓ చిన్న పాత్రలో కనువిందు చేశారు. ఇక టాలీవుడ్‌కు రావాల్సిన టైమ్‌ వచ్చేసింది. గోపిచంద్‌ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న క్రాక్‌ సినిమాలో శృతి హీరోయిన్‌గా చేస్తుందన్న సంగతి తెలిసిందే. దాంతో పాటు పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ కమ్‌బ్యాక్‌ సినిమా వకీల్‌ సాబ్‌ సినిమాలో కూడా కీలక పాత్రలో శృతి నటిస్తుందని వార్తలు వచ్చినా వాటిపై మూవీ టీమ్‌ ఏం స్పందించలేదు. మధ్యమధ్యలో ఆ పాత్ర కీర్తి సురేశ్‌ చేస్తుందని, రాశి ఖన్నా ఆ రోల్‌లో కనిపించబోతుందని పుకార్లు వినిపించాయి. అందుకే ఏది నిజమో తెలియని అయోమయ స్థితిలో పడిపోయారు ఫ్యాన్స్‌.   (వెబ్‌ సిరీస్‌లతో నిర్మాతగా..)

పవన్‌ కళ్యాణ్‌తో ఇప్పటికే రెండుసార్లు కలిసి నటించిన శృతి హాసన్‌ వకీల్‌ సాబ్‌ సినిమాతో మూడోసారి జతకట్టబోతుందని తేలిపోయింది. తను ఈ సినిమా షూటింగ్‌లో పాల్గోనే తేదీ కూడా ఖరారయ్యింది. ప్రస్తుత షెడ్యూల్‌లో పవన్‌ కళ్యాణ్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాడు దర్శకుడు వేణు శ్రీరామ్‌. ఈ షెడ్యూల్‌ ఒక వారంలో ముగియనుంది. డిసెంబర్‌ మొదటివారంలో మొదలుకానున్న తరువాతి షెడ్యూల్‌లో శృతి హాసన్‌ సెట్‌లోకి అడుగుపెట్టనున్నారు. గబ్బర్‌సింగ్‌, కాటమరాయుడు సినిమాలలో లాగా వకీల్‌సాబ్‌ సినిమాలో శృతిది ఫుల్‌ లెన్త్‌ రోల్‌ కాదని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు