Shruti Haasan : యూట్యూబ్‌లో దుమ్మురేపుతున్న శ్రుతిహాసన్‌ సాంగ్‌ విన్నారా?

10 Sep, 2022 14:59 IST|Sakshi

తమిళసినిమా: బోల్డ్, బ్యూటిఫుల్‌ ఇండియన్‌ నటి శ్రుతిహాసన్‌ లోకనాయకుడు కమలహాసన్‌ వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసినా మొదట సంగీతంలో ఆసక్తి చూపారు. ఆ రంగంలో ప్రైవేటు ఆల్బమ్‌లు రూపొందించిన ఆమె ఆ తరువాత సినీ సంగీత దర్శకురాలిగా పరిచయమయ్యారు. తన తండ్రి కమలహాసన్‌ కథానాయకుడుగా నటించిన ఉన్నైపోల్‌ ఒరువన్‌ చిత్రానికి సంగీతాన్ని అందించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తరువాత కథానాయకిగా రంగ ప్రవేశం చేశారు. అలా హిందీ, తెలుగు, తమిళం మొదలగు భాషల్లో కథానాయికగా నటిస్తూ ఇప్పుడు అగ్రనాయికల్లో ఒకరుగా పేరు సంపాదించుకున్నారు.

అయితే తమిళంలో కంటే తెలుగులోనే ఎక్కువ విజయాలు అందుకుని అక్కడ క్రేజీ హీరోయిన్‌గా రాణిస్తుండటం విశేషం. కాగా తెలుగులో ప్రస్తుతం పాత చిత్రాల రీ రిలీజ్‌ ట్రెండ్‌ నడుస్తోంది. మహేష్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ వంటి స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలై అనూహ్య కలెక్షన్లను రాబడుతున్నాయి. మరికొన్ని చిత్రాలను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా నటి శ్రుతిహాసన్‌ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆమె తమిళంలో ధనుష్‌కు జంటగా నటించిన 3 చిత్రం తెలుగు వెర్షన్‌ను గత మూడు రోజుల క్రితం రీ రిలీజ్‌ చేశారు. ఈ చిత్రం అక్కడ 200 థియేటర్లలో విడుదలై మంచి కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రంలో శృతిహాసన్‌ నటనకు అప్పట్లో మంచి ప్రశంసలు లభించాయి.

ముఖ్యంగా సంగీత దర్శకుడు అనిరుధ్‌ బాణీలు కట్టిన ఈ చిత్రంలోని వై దిస్‌ కొలవరి పాట ప్రపంచ వ్యాప్తంగా ఊపేసింది. అలాంటి చిత్రాన్ని మళ్లీ తెలుగు ప్రేక్షకులు ఆదరించటం చాలా సంతోషంగా ఉందని శ్రుతిహాసన్‌ పేర్కొన్నారు. కాగా సినిమాలో నటిస్తునే తన సంగీత బృందంతో మ్యూజిక్‌ ఆల్భమ్‌ రూపొందిస్తున్న ఈ సంచలన నటి తాజాగా వెస్ట్రన్‌ స్టైల్లో సీ ఈజ్‌ హీరో అనే వీడియో ఆల్బమ్‌ రూపొందించారు. ఇది ఇప్పుడు సోషల్‌ మీడియాలో ప్రచారం అవుతూ దుమ్ము రేపుతోంది. ప్రస్తుతం ప్రభాస్‌ జంటగా సలార్‌ అనే పాన్‌ ఇండియా చిత్రంలో నటిస్తున్నారు. అదే విధంగా మెగాస్టార్‌ చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోలతో నటిస్తూ బిజీగా ఉన్నారు.

మరిన్ని వార్తలు