Shruti Haasan : 'చాలామంది హీరోయిన్లు ఉన్నారు, నేనేమీ అతీతం కాదు'.. శ్రుతి గట్టి కౌంటర్‌

3 Jan, 2023 09:00 IST|Sakshi

అగ్ర కథానాయకుడు కమలహాసన్‌ వారసురాలిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి శృతిహాసన్‌. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్న నానుడికి వ్యతిరేకంగా శృతిహాసన్‌ నట జీవితం సాగుతోందని చెప్పక తప్పదు. కోలీవుడ్‌లో విజయ్, సూర్య, విశాల్, విజయ్‌ సేతుపతి వంటి స్టార్‌ హీరోలతో నటించినా ఇక్కడ పెద్దగా విజయాలను అందుకోలేకపోయారు. విశాల్‌ సరసన నటించిన పూజ చిత్రం కమర్షియల్‌గా విజయాన్ని సాధించింది. శృతిహాసన్‌ తమిళంలో చివరిగా నటించిన చిత్రం లాభం. అది నిరాశ పరిచింది. ఆ తరువాత తమిళ తెరపై కనిపించలేదు.

ఇక తెలుగులో మహేష్‌ బాబు, రవితేజా వంటి స్టార్‌ హీరోలతో నటించి సక్సెస్‌ అందుకున్నారు. ప్రస్తుతం అక్కడ మూడు చిత్రాల్లో నటిస్తుండగా, అందులో ఒకటి చిరంజీవికి జంటగా నటించిన వాల్తేరు వీరయ్య కాగా మరొకటి బాలకృష్ణకు జంటగా నటించిన వీర సింహారెడ్డి చిత్రం. మూడోది ప్రభాస్‌తో సలార్‌ చిత్రం. విశేషం ఏమిటంటే చిరంజీవి, బాలకృష్ణతో నటించిన వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి చిత్రాలు సంక్రాంతి బరిలో ఢీ కొనబోతున్నాయి. అసలు విషయం ఏమిటంటే శృతిహాసన్‌ దాదాపు తన తండ్రి వయసు కలిగిన సీనియర్‌ నటుల సరసన నటించడంపైనే నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు.

శృతిహాసన్‌ తనకంటే రెట్టింపు వయసు ఉన్న సీనియర్‌ నటులతో నటించడానికి కారణం అవకాశాలు లేవనా, డబ్బు కోసమా? అంటూ నెటిజన్లు ట్రోలింగ్‌ చేస్తున్నారు. వీటికి శృతిహాసన్‌ స్ట్రాంగ్‌గానే బదులిచ్చారు. ఆమె తన ట్విట్టర్‌లో ట్రోలింగ్లపై స్పందిస్తూ సినిమా రంగంలో వయసు అన్నది నంబర్‌ మాత్రమేనన్నారు. ప్రతిభ, సత్తా ఉంటే మరణించే వరకూ నటించవచ్చన్నారు. దీన్ని ఇంతకు ముందు పలువురు హీరోలు తమ వయసులో సగం వయసు గల హీరోయిన్లతో నటించి నిరూపించారని.. తానేమీ ఇందుకు అతీతం కాదని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు