కియారా అద్వానీ పెళ్లికి ముహూర్తం కుదిరిందా? 

4 Jan, 2023 02:39 IST|Sakshi
కియారా, సిద్ధార్థ్‌

ఈ కొత్త సంవత్సరం తొలిరోజు వార్తల్లో నిలిచినవారిలో హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రా, హీరోయిన్‌ కియారా అద్వానీ జంట ఒకటి. ఈ జంట దుబాయ్‌ వెళ్లి, అక్కడే సంబరాలు జరుపుకున్నారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్త ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది ‘షేర్షా’ చిత్రంలో నటించినప్పుడు ప్రేమలో పడ్డారని ప్రచారం జరిగింది.

ప్రస్తుతం ఈ ఇద్దరూ తమ పెళ్లి పనులతో బిజీగా ఉన్నారని సమాచారం. ఫిబ్రవరి 6న పెళ్లికి ముహూర్తం కుదిరిందని బాలీవుడ్‌ టాక్‌. మెహందీ, సంగీత్, పెళ్లి.. ఈ మూడు వేడుకలు రెండు రోజుల పాటు జరగనున్నాయట. మెహందీ, సంగీత్‌ ఒకే రోజున, ఆ మర్నాడు వివాహ వేడుకను ప్లాన్‌ చేశారని భోగట్టా. రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ ప్యాలేస్‌ వివాహ వేదిక కానుందనీ, పంజాబీ సంప్రదాయంలో పెళ్లి జరగనుందనీ టాక్‌. కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల మధ్య పెళ్లి చేసుకుని, సినీ ప్రముఖులకు ముంబయ్‌లో గ్రాండ్‌ రిసెప్షన్‌ ఏర్పాటు చేయాలని సిద్ధార్థ్, కియారా అనుకున్నారట.

ఇక సినిమాల విషయానికి వస్తే.. సిద్ధార్థ్‌కి హిందీలో నటుడిగా మంచి పేరుంది. కియారా తెలుగులో మహేశ్‌బాబు సరసన ‘భరత్‌ అనే నేను’, రామ్‌చరణ్‌తో ‘వినయ విధేయ రామ’ చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఆమే  హీరోయిన్‌. హిందీ చిత్రాల్లోనూ కియారా నటిస్తున్నారు.    

మరిన్ని వార్తలు