త్వరలో తమిళ సినిమా చేయనున్న సిద్ధార్థ్‌ మల్హోత్రా?

17 Sep, 2021 14:27 IST|Sakshi

బాలీవుడ్‌ యంగ్‌ హీరో సిద్దార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీలు జంటగా నటించిన షేర్షా మూవీ ఇటీవల అమెజాన్‌ ప్రైంలో విడుదలైన సంగతి తెలిసిందే. కార్గిల్ యుద్ధ వీరుడు విక్రమ్ బాత్రా పాత్రలో నటించిన సిద్ధార్థ్ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నాడు. అజిత్‌ ‘బిల్లా’ దర్శకుడు విష్ణువర్ధన్ దీనికి దర్శకత్వం వహించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు సిద్దార్థ్‌ నేరుగా కోలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఫిలిం దూనియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. సాధారణంగా ఒక భాషకు చెందిన హీరో డబ్బింగ్‌తో ఇతర భాష ప్రేక్షకులను పలకరిస్తుంటారు. కానీ ఈ యంగ్‌ హీరో డైరెక్ట్‌గా కోలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమైనట్లు బీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా సిద్ధార్థ్ ట్విట్టర్‌లో ఆస్క్‌మీ ఎనిథింగ్‌ సెషన్‌ నిర్వహించాడు.

ఈ సందర్భంగా అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు అతడు సమాధానం ఇచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ నెటిజన్‌ నెటిజన్ ‘హలో బ్రదర్‌. నేను తమిళుడిని. మీ అభిమానిని. ఇక్కడ మీ నటనకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. తమిళ సినిమాలో ఎప్పుడు నటిస్తారు?’ అని అడగ్గా.. దానికి సిద్దర్థ్‌  ‘అయితే సరే’ అని సమాధానం ఇచ్చాడు. అనంతరం దీనికి హీరోయిన్‌ రష్మిక మందన్నా ‘మేము చూస్తాం’ అంటూ నవ్వుతున్న ఎమోజీని జంత చేసింది. దీంతో ఈ కుర్ర హీరో సౌత్‌లో నేరుగా అడుగుపెట్టాబోతున్నాడనే వార్తలు షికారు చేస్తున్నాయి. కాగా సిద్దార్థ్‌ మల్హోత్రా, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిషన్ మజ్ను’. ఈ మూవీతో ఆమె బాలీవుడ్‌లో అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.  ఒకవేళ సిద్దార్థ్‌ తమిళంలో సినిమా చేస్తే అందులో ఖచ్చితంగా రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు.  

>
మరిన్ని వార్తలు