Simbu-Rajinikanth: రజనీ స్కి‍ప్ట్‌తో శింబు మూవీ?

3 Mar, 2023 09:39 IST|Sakshi

తమిళ సినిమా: నటుడు శింబు.. ప్రస్తుతం పత్తుతల చిత్రంలో నటిస్తున్నారు. ప్రియ భవానీ శంకర్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి చిల్లన్ను ఒరు కాదల్‌ చిత్రం ఫేమ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్‌ పతాకంపై జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇది కన్నడ చిత్రం మట్టికి రీమేక్‌ కావడం గమనార్హం.

ఇందులో శింబు గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్నారు. ఈ నెల 30వ తేదీన చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో శింబు తదుపరి చిత్రం ఏమిటన్నది ఆసక్తిగా మారింది. కారణం ఇంతకు ముందు ఈయన గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో నటించిన వెందు తనిందదు కాడు చిత్రానికి సీక్వెల్‌ ఉంటుందని ఆ చిత్ర నిర్మాత ఐసరి గణేష్‌ వెల్లడించారు. అయితే ఆ చిత్రానికి ఇంకా సమయం ఉందని సమాచారం. ఇకపోతే ఇంతకు ముందు కన్నుమ్‌ కన్నుమ్‌ కొల్‌లైయడిత్తాల్‌ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన దేసింగు పెరియసామి తదుపరి రజినీకాంత్‌ కోసం కథను సిద్ధం చేసుకున్నారు.

ఆయన్ని కలిసి కథను వినిపించారు. రజనీకాంత్‌  కూడా కథా నచ్చిందని ప్రచారం జరిగింది. అయితే ఆయన దేసింగు పెరియసామిని పక్కన పెట్టి బీస్ట్‌ చిత్రం ఫేమ్‌ నెల్సన్‌కు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రమే నిర్మాణంలో ఉన్న జైలర్‌. దీంతో ఎప్పటికైనా రజనీకాంత్‌తో చిత్రం చేస్తానని చెప్పిన దేసింగు పెరియసామి తాజాగా శింబు హీరోగా చిత్రం చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం. శింబు హీరోగా చేసే చిత్రం రజినీకాంత్‌కు చెప్పిన కథా లేక వేరేనా అన్న చర్చ కోలీవుడ్‌లో జరుగుతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.   

మరిన్ని వార్తలు