భగవంతుని ఆశీస్సుల వల్లే అవార్డు: పి.సుశీల

10 Apr, 2021 07:57 IST|Sakshi

చెన్నై: జీవిత సాఫల్య అవార్డు భగవంతుని ఆశీస్సుల వల్లే తనకు లభించిందని ప్రఖ్యాత గాయని పి.సుశీల పేర్కొన్నారు. గాయని పి.సుశీలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇంగ్లాండ్‌ మగళీర్‌ నెట్వర్క్‌ అనే సంస్థ జీవిత సాఫల్య అవార్డు ప్రకటించిన విషయం తెలిసిందే. బ్రిటన్‌ దేశానికి చెందిన ఈ సంస్థ ప్రతి ఏడాది ఆ దేశానికి చెందిన వివిధ రంగాల్లో విశేష సేవలందించిన మహిళలకు జీవిత సాఫల్య అవార్డు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పురస్కారం వేడుకల కార్యక్రమం బ్రిటన్‌ పార్లమెంట్‌ సభలో సభ్యుల సమక్షంలో నిర్వహిస్తూ ఉంటారు.

ఈ ఏడాది ఇంగ్లాండ్‌ దేశేతర ప్రముఖ మహిళలనూ ఈ అవార్డుతో సహకరించాలని నిర్ణయించారు. అందులో భాగంగా మన దేశానికి చెందిన ప్రముఖ గాయని పి.సుశీల, ఏఆర్‌ రెహమాన్‌ సహోదరి, మహిళా సంగీత దర్శకురాలు ఏ.ఆర్‌ రెహానాలకు జీవిత సాఫల్య అవార్డు ప్రకటించారు. కరోనా కారణంగా ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఇటీవల ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహించారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఇంగ్లాండ్‌ మగళీర్‌ నెట్‌వర్క్‌ సంస్థకు చెందిన చెన్నై నిర్వాహకులు నజ్రిన్, అష్రఫ్‌ శుక్రవారం చెన్నైలో గాయని పి.సుశీలను కలిసి జీవిత సాఫల్య అవార్డు అందించారు. ఈ సందర్భంగా పి.సుశీల మాట్లాడుతూ బ్రిటన్‌కు చెందిన సంస్థ ఇతర దేశాలకు చెందిన ప్రముఖులను జీవిత సాఫల్య అవార్డుతో సత్కరించాలని నిర్ణయించిన తొలి ఏడాదిలోనే తనకి అవార్డు రావడం సైతం భగవంతుని ఆశీస్సులుగా భావిస్తున్నాను అన్నారు. 
చదవండి: ఇది వీరప్పన్‌ కథ కాదు! 

మరిన్ని వార్తలు