రామ్‌ ‘ఇంకేంటీ’ అంటే అర్థం చేసుకోలేకపోయా: సునీత

14 Feb, 2021 20:12 IST|Sakshi

తన గాత్ర మాధుర్యంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రముఖ గాయని సునీత.  సునీత పాటకు పరవశించని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. తన గొంతుతో వందలాది పాటలకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చారు. ఇక ఎన్నో ఏళ్లపాటు ఒంటరి జీవితాన్ని గడిపిన సునీత తాజాగా వివాహ బంధంతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. శంషాబాద్‌లోని ఓ ఆలయంలో ఈ ఏడాది జనవరి 9న వ్యాపారవేత్త రామ్ వీరపనేని వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం సునీత తన వైవాహిక బంధాన్ని ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. 

ఇదిలా ఉంటే తాజాగా వాలెంటైన్స్‌ డే సందర్భంగా ఈ జంట ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించిన టాక్ షోలో ఈ జంట తమ ప్రేమ బంధాన్ని వివరించింది. సునీత ప్రేమను పొందడానికి ఏడేళ్లు నిరీక్షించానని రామ్‌ చెప్పుకొచ్చారు. ‘ఏడేళ్లుగా సునీతను ఇష్టపడుతూ వచ్చాను. కానీ  ఈ విషయాన్ని ఎప్పుడూ నేరుగా ఆమెతో చెప్పలేదు’అని రామ్‌ అన్నారు. ఇక ఇదే విషయమై సునీత మాట్లాడుతూ.. ‘రామ్ నాతో  కేవలం ‘ఇంకేంటీ‘ అంటూ మాత్రమే అనేవాడు. దాంట్లో అర్థాన్ని తెలుసుకోలేకపోయాను. రామ్‌ ఫోన్‌ చేస్తే కూడా లిఫ్ట్‌ చేసేదాన్ని కాదు. నేను అసలు పెళ్లికి సిద్ధంగా లేను.. కానీ లాక్‌డౌన్‌లోనే ఏదో జరిగింది. ఏదో పని కోసం కాల్ చేసిన రామ్.. ఫోన్‌లోనే నాకు పెళ్లి ప్రపోజ్ చేశాడు. ఆ తర్వాత ఇద్దరం కలిసి మాట్లాడుకున్న తర్వాత నేనూ పెళ్లికి ఓకే చెప్పాను’ అని తమ లవ్‌స్టోరిని వెల్లడించారు. 

>
మరిన్ని వార్తలు