ఆ మ్యూజిక్‌ డైరెక్టర్‌ భార్య అలా అడగడంతో రాత్రంతా ఏడ్చాను: సునీత

10 Aug, 2021 13:34 IST|Sakshi

టాలీవుడ్‌లో సింగర్‌ సునీతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సింగ‌ర్‌గా, డ‌బ్బింగ్ ఆర్టిస్ట్‌గా తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకుంది. తన మధుర గాత్రంతో వందల పాటలు పాడి లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్న ఆమెకు.. టాలీవుడ్‌ ఏ సింగర్‌ లేని ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవల రామ్‌ వీరపనేనిని అనే వ్యాపారవేత్తను రెండో వివాహం చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది. ఇటూ ప్రొఫెషనల్‌ అటూ పర్సనల్‌ లైఫ్‌ను బ్యాలెస్‌ చేసుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతున్న సునీత తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తిర విషయాలను పంచుకుంది. 

తన కెరీర్‌ ఎదుర్కొన్న చేదు సంఘటనల గురించి ఈ సందర్భంగా వెల్లడించింది. గతంలో ఓ డైరెక్టర్‌ తనతో విచిత్రం వ్యహరించారంటూ నోరు విప్పిన సునీత తాజాగా ఓ ప్రముఖ సంగీత దర్శకుడు స్టూడియోలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది. ఈ సందర్బంగా సునీత మాట్లాడుతూ.. ‘ఓ పెద్ద మ్యూజిక్‌ డైరెక్టర్‌ స్టూడియోకు పాట పాడేందుకు వెళ్లిన నాకు అనుకోని సంఘటన ఎదురైంది. అది తలుచుకుని ఓ రాత్రంతా ఏడ్చేశాను. అక్కడికి వెళ్లాక ఆ డైరెక్టర్‌ తన చేతిలో ఉన్న మైకును నాకు ఇచ్చారు. దాన్ని తీసుకొని పాట పాడేశాను. అయిపోయాక ఆ మైక్‌ అక్కడ పెట్టి తిరిగి వస్తుంటే ఆయన భార్య నన్ను పిలిచి దారుణంగా అవమానించింది.

ఏంటీ మైక్‌ తీసుకునేటప్పుడు మా ఆయన చేతి వేళ్లను తాకుతున్నావు.. అసలేమనుకుంటున్నావు. నీ ఉద్దేశం ఏంటి అని ప్రశ్నించింది. అది విని ఒక్కసారిగా షాక్‌ అయ్యాను. ఆ తర్వాత నా స్టయిల్‌లో ఆమెకు గట్టిగా సమాధానం ఇచ్చాను. అక్కడ ధైర్యంగా తనతో మాట్లాడినప్పటికీ అలా అడగడం చాలా బాధించింది.  నా తప్పు లేకపోయిన నిందలు పడ్డాను. ఇంటికి వెళ్లాక ఈ సంఘటనను తలచుకుని ఓ రాత్రంత ఏడ్చాను’ అని చెప్పుకొచ్చింది. అలాగే ఇలాంటి దారుణమైన సంఘటనలు తన జీవితంలో ఎన్నో ఎదుర్కొన్నానంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అప్పుడు కొందరిని కొట్టాలనిపించింది, కానీ కొట్టకుండా వచ్చేశానంది. ఇలా చాలా సందర్భాల్లో తిట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పింది. ఇప్పుడు వాటన్నింటి గురించి తాను చెప్పడం తనకు ఇష్టం లేదని ఆమె పేర్కొంది. అయితే సునీత ఆ సంగీత దర్శకుడు ఎవరనేది మాత్రం చెప్పలేదు.

మరిన్ని వార్తలు