Sakshi Excellence Awards:ఉత్తమ గీత రచయితగా ‘సిరివెన్నెల’

25 Sep, 2021 11:49 IST|Sakshi

కరోనా వేళ సినీ వేడుకలు లేవు. అది కూడా ఒకే వేదిక మీద రెండు వేడుకలు జరిగితే ఆ ఆనందం అంబరమే. ఆ ఆనందానికి వేదిక అయింది ‘సాక్షి’ మీడియా గ్రూప్‌. ప్రతిభను గుర్తించింది... తారలను అవార్డులతో సత్కరించింది. 2019, 2020 సంవత్సరాలకు గాను స‘కళ’ జనుల ‘సాక్షి’గా ‘ఎక్స్‌లెన్స్‌ అవార్డు’ల వేడుక కనువిందుగా జరిగింది. ఎంతో అంగరంగా వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో మహేశ్‌బాబు, అల్లు అర్జున్‌తో పాటు పలువురు హీరో, హీరోయిన్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులు పొందిన నటులు తమ ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. 

థ్యాంక్యూ భారతీగారు.. థ్యాంక్స్‌ సాగరికాగారు.. ఈ అవార్డు అందుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మా నిర్మాత అల్లు అరవింద్‌గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం అద్భుతమైన అనుభూతి. ఈ అవార్డు మీది, మారుతిగార్లదే. నా కెరీర్‌ బిగినింగ్‌ నుంచి నాపై మీరు ఎంతో నమ్మకం పెట్టారు. ‘ప్రతిరోజూ పండగే’ చిత్రంలో నాకోసం మంచి క్యారెక్టర్‌ రాసిన మారుతి సార్‌కి థ్యాంక్స్‌. ప్రేక్షకుల ఆదరణ వల్లే నాకు ఈ అవార్డు వచ్చింది. అలాగే  ‘వెంకీ మామ’ సినిమాలో మంచి పాత్ర ఇచ్చిన డైరెక్టర్‌ బాబీ, నిర్మాత సురేశ్‌బాబులకు థ్యాంక్స్‌. ‘సాక్షి’ వారు నాకు ఈ అవార్డు ఇవ్వడం గౌరవంగా ఉంది. ‘సాక్షి’ చానల్‌ నా కెరీర్‌ ప్రారంభం నుంచి నాకు చాలా సపోర్ట్‌ చేసింది. థ్యాంక్యూ సో మచ్‌.   – రాశీ ఖన్నా, మోస్ట్‌ పాపులర్‌ యాక్ట్రస్‌ (వెంకీ మామ, ప్రతిరోజూ పండగే)

‘జెర్సీ’ మూవీ నా ఒక్కడికే కాదు, మా ఎంటైర్‌ టీమ్‌కి కూడా చాలా స్పెషల్‌ మూవీ. ఈ సినిమాకు ఏ అవార్డు వచ్చినా అది మా మొత్తం టీమ్‌కి చెందుతుంది.  మాకు ఈ అవార్డు ఇచ్చినందుకు కృతజ్ఞతలు.  – గౌతమ్‌ తిన్ననూరి, క్రిటికల్లీ అక్లైమ్డ్‌ డైరెక్టర్‌ (జెర్సీ)

యాభై వేలకు పైగా పాటలు పాడారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారు. ఈ బరువు (బాలు తరఫున అవార్డు అందుకున్నారు) నేను మాత్రమే మోయలేను. మీరు కూడా వచ్చి సాయం పట్టండి.. తమన్‌ నువ్వు కూడా రా.. థ్యాంక్యూ.  – మణిశర్మ (మోస్ట్‌ పాపులర్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌)గా కూడా మణిశర్మ అవార్డు అందుకున్నారు).

 ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రిగారి బెస్ట్‌ లిరిసిస్ట్‌ అవార్డు అందుకుంటుంటే సాయిమాధవ్‌ చేతులు వణుకుతున్నాయి.. ఇస్తుంటే నాకు కూడా వణుకుతున్నాయి. ఎందుకంటే శాస్త్రిగారి బరువు మోయటం అంత సులువు కాదు. కొన్ని వేల పాటల్ని మనందరి జీవితాల్లోకి వదిలేసిన మహా వృక్షం అది.  – త్రివిక్రమ్‌

‘సిరివెన్నెల’గారి  గొప్పదనం గురించి చెప్పాలంటే ప్రపంచంలోని భాషలన్నీ వాడేసినా ఇంకా బ్యాలెన్స్‌ ఉంటుంది. ఆయన అవార్డును ఆయన బదులుగా నేను తీసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను. – సాయిమాధవ్‌ బుర్రా

‘సాక్షి’ ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2020కి ఉత్తమ గీచ రచయితగా ఒక పాట కాకుండా మూడు పాటలకు (అల వైకుంఠపురములో, జాను, డిస్కోరాజా) ఎంపిక చేశారు. ‘డిస్కోరాజా’ చిత్రంలో నా పాటకి మా అన్నయ్య బాలూగారు పాడిన చివరి పాటల్లో ఒకటి కావడం కొంత విషాదాన్ని కలిగిస్తుంది.. కొంత ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. ఈ అవార్డు తీసుకోవడానికి ఆ రోజు నేను వేదికపైకి రాలేకపోయాను. నా తరఫున అవార్డు అందుకున్న బుర్రా సాయిమాధవ్‌ అత్యద్భుతమైన ప్రతిభ కలిగిన రచయిత, నా ఆత్మీయ సోదరుడు. పాటల గురించి, మూవీ గురించి సంక్షిప్తంగా నాలుగు మంచి మాటలు చెప్పిన ప్రఖ్యాత దర్శకులు, రచయిత త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌కి థ్యాంక్స్‌. – పాటల రచయిత ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి,  మోస్ట్‌ పాపులర్‌ లిరిసిస్ట్‌–‘సామజ వరగమన’ (అల వైకుంఠపురములో)..., ‘లైఫ్‌ ఆఫ్‌ రామ్‌...’ (జాను) ‘నువ్వు నాతో ఏమన్నావో...’ (డిస్కో రాజా). 

మరిన్ని వార్తలు