‘దర్జా’లో అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి : నిర్మాతలు

23 Jul, 2022 18:16 IST|Sakshi
శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి

సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘దర్జా’. సలీమ్‌ మాలిక్‌ దర్శకత్వం  వహించిన ఈ చిత్రం జూలై 22న థియేటర్స్‌లో విడుదలై మంచి టాక్‌ని సొంతం చేసుకుంది.  భారీ వర్షాల కారణంగా కాస్త ఓపెనింగ్స్ తగ్గినప్పటికీ.. సినిమాకి వస్తున్న టాక్‌తో కలెక్షన్స్‌ పెరుగుతున్నాయని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

తాజాగా ఈ చిత్ర నిర్మాతలు శివశంకర్ పైడిపాటి, రవి పైడిపాటి మీడియాతో మాట్లాడుతూ.. ‘మా సినిమాని ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. సినిమాలోని పాటలు, ఫైట్స్, సెంటిమెంట్.. చాలా బాగున్నాయంటూ పలువురు సినీ ప్రముఖులు ఫోన్ చేసి అభినందిస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చాలా మంది ఇది యాక్షన్ సినిమా అనుకుని వచ్చాము.. కానీ సినిమాలో అక్కాచెల్లెళ్ల అనుబంధం, అక్కాతమ్ముళ్ల అనుబంధాన్ని చాలా చక్కగా చూపించారని, ముఖ్యంగా సెంటిమెంట్ సీన్లు చాలా బాగున్నాయని అంటున్నారు.

ఈ సినిమాలో ప్రేక్షకులకు కావాల్సిన అన్ని కమర్షియల్ అంశాలు ఉన్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి ఈ సినిమాని మరింతగా సక్సెస్ చేయాలని కోరుతున్నాం’అన్నారు. పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సలీమ్ మాలిక్ దర్శకత్వంలో శివశంకర్ పైడిపాటి ఈ చిత్రాన్ని నిర్మించారు. కో అండ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరించారు.

మరిన్ని వార్తలు