Smriti Irani: నీకు సిగ్గుగా లేదా? అని మేకప్‌మెన్‌ అవమానకరంగా..

26 Mar, 2023 17:48 IST|Sakshi

కేంద్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి స్మృతి ఇరానీ మొదట్లో బుల్లితెరపై నటిగా రాణించిన విషయం అందరికీ తెలిసిందే! రామాయణ్‌, విరుధ్‌: హర్‌ రిష్తా ఏక్‌ కురుక్షేత్ర, హమ్‌ హై కల్‌ ఆజ్‌ ఔర్‌ కల్‌, క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ వంటి సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు. అయితే సీరియల్స్‌లో నటిస్తున్న సమయంలో మేకప్‌మెన్‌ తనను అవమానించాడట.

దీని గురించి తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ సీరియల్‌ మొదటి ఏడాది నాకు రోజుకు రూ.1800 ఇచ్చారు. అప్పటికింకా నాకు సొంతంగా కారు కూడా లేదు. జుబిన్‌ను పెళ్లాడాక మాకిద్దరికీ కలిపి రూ.30,000 దాకా వచ్చేవి. అయినా సరే నేను ఆటోలోనే సెట్స్‌కు వెళ్లేదాన్ని. ఓ రోజు నా మేకప్‌ మెన్‌.. నేను రోజూ కారులో వస్తున్నా, మీరిలా ఆటోలో వస్తున్నందుకు సిగ్గుగా అనిపించట్లేదా? అని ముఖం మీదే అడిగాడు. సొంతంగా ఏదైనా బండి కొనుక్కోవచ్చుగా అని చెప్పాడు. అప్పుడు నాకెంతో అవమానంగా అనిపించింది.

మరోవైపు సీరియల్‌ సెట్‌లో ఎటువండి కూల్‌డ్రింక్స్‌, ఫుడ్‌ తీసుకోవడానికి వీల్లేదు అని స్ట్రిక్ట్‌ రూల్స్‌ ఉండేవి. ఎందుకంటే ఆ ఫుడ్‌ అక్కడున్న వస్తువులపై పడితే శుభ్రం చేయడం కష్టం అవుతుందని యూనిట్‌ బాధ! అందుకే ఎప్పుడైనా టీ తాగాలనిపిస్తే సెట్‌ నుంచి బయటకు వచ్చి ఛాయ్‌ ఆస్వాదించేదాన్ని' అని చెప్పుకొచ్చారు. ఇకపోతే క్యూంకీ సాస్‌ భీ కభీ బహు థీ సీరియల్‌లో ఆమె తులసి విరాణిగా నటించారు. కాగా స్మృతి ఇరానీ 2003లో భారతీయ జనతా పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో అమేథీ గడ్డపై రాహుల్‌ గాంధీని ఓడించి ఎంపీగా గెలుపొందారు.

మరిన్ని వార్తలు