ఐదు సినిమాలు చేసి ఊరెళ్లిపోతానన్నాడు

12 Dec, 2020 00:12 IST|Sakshi
బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, రాజేంద్రప్రసాద్, సాయితేజ్, సుబ్బు, రావు రమేశ్‌

– సాయితేజ్‌

‘‘దర్శకుడు సుబ్బు నిబద్ధత ఉన్న వ్యక్తి. ఈ సినిమా కోసం కన్విక్షన్‌తో పని చేశాడు. నాకు కథను ఎంత కసితో చెప్పాడో సినిమాను అంతే కసిగా తీశాడు’’ అని హీరో సాయితేజ్‌ అన్నారు. సుబ్బు దర్శకత్వంలో సాయితేజ్, నభా నటేశ్‌ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్‌’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించిన ఈ సినిమాను జీ స్టూడియో అసోసియేషన్‌తో ఈ నెల 25న విడుదల చేస్తున్నారు. టైటిల్‌ ట్రాక్‌ను శుక్రవారం విడుదల చేశారు. సాయితేజ్‌ మాట్లాడుతూ –‘‘సుబ్బు ఐదు సినిమాలు చేసేసి ఊరెళ్లిపోతానని అన్నాడు. కానీ.. తను యాభై సినిమాలు చేయాలనుంది.

‘నో పెళ్లి..’ పాట లిరికల్‌ వీడియోలో రానా, వరుణ్‌ తేజ్‌ కూడా నటించారు. ఈ పాటను నితిన్‌ విడుదల చేశారు. ఈ ముగ్గురికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘కథను, నన్ను నమ్మి సినిమా చేసినందుకు సాయితేజ్‌కి కృతజ్ఞతలు. నిర్మా తలు కుటుంబ సభ్యుడిలా భావించి నాకు సహకారం అందించారు’’ అన్నారు సుబ్బు. ‘‘ఆరేడు నెలల అజ్ఞాతవాసం తర్వాత పాండవులలా బాక్సాఫీస్‌ యుద్ధానికి సినీ ఇండస్ట్రీ బయలుదేరింది’’ అన్నారు రాజేంద్ర ప్రసాద్‌. ‘‘మనం ఎప్పుడు చూసినా తుది గెలుపు సినిమాదే’’ అన్నారు రావు రమేశ్‌. జీ స్టూడియోస్‌ ప్రతినిధి నీరజ్‌ జోషీ, గీతరచయితలు కాసర్ల శ్యామ్, రఘురామ్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు