ప్రేమ గానం

14 Feb, 2021 06:29 IST|Sakshi

వేలంటైన్స్‌ డే స్పెషల్‌గా ‘టక్‌ జగదీష్‌’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’ చిత్రాల్లోని ప్రేమ పాటలను రిలీజ్‌ చేశారు.

ఆ విశేషాలు...
ఇంకోసారి ఇంకోసారి
‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ అని తన ప్రేయసి గురించి పాడుకుంటున్నారు టక్‌ జగదీష్‌. ఈ పాట వెనుక కథేంటో సినిమా చూసి తెలుసుకోవాలి. నాని హీరోగా రీతూ వర్మ, ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్లుగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘టక్‌ జగదీష్‌’. ఈ సినిమాలోని మొదటి పాట ‘ఇంకోసారి ఇంకోసారి నీ పిలుపే నా ఎదలో చేరి’ని విడుదల చేశారు. తమన్‌  సంగీతం అందించిన ఈ పాటను శ్రేయా ఘోషల్, కాలభైరవ ఆలపించారు. చైతన్య ప్రసాద్‌ రచించారు. ఏప్రిల్‌లో సినిమా విడుదల.

గుచ్చే గులాబీ

‘గుచ్చే గులాబీలా నా గుండెలోతునే తాకినదే..’ అంటూ తన ప్రేయసి కోసం పాడుతున్నారు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ అఖిల్‌. ఆయన హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’. పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమాలోని రెండో పాటను శనివారం విడుదల చేశారు. గోపీసుందర్‌ సంగీతంలో అనంత్‌ శ్రీరామ్‌ రచించిన ఈ పాటను అర్మాన్‌  మాలిక్‌ పాడారు. జూన్‌  19న విడుదల కానున్న ఈ సినిమాను ‘బన్నీ’ వాసు, వాసు వర్మ నిర్మించారు.

మస్తీ చేస్కో
‘డబ్బే ఉంటే మస్తీ చేస్కో’ అంటు న్నారు విష్ణు మంచు. ఆయన హీరోగా నటించి, నిర్మించిన తాజా చిత్రం ‘మోసగాళ్లు’. భారీ ఐటీ స్కామ్‌ ఆధారంగా హాలీవుడ్‌ దర్శకుడు జెఫ్రీ గీ చిన్‌ ఈ సినిమాను తెరకెక్కించారు. కాజల్‌ అగర్వాల్, రుహీ సింగ్, సునీల్‌ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో రెండవ పాట ‘డబ్బే మనది కుమ్మేస్కో.. మస్తీ మస్తీ చేస్కో.. కాస్ట్‌లీ మందే వేసేస్కో...’ని శుక్రవారం రిలీజ్‌ చేశారు. సామ్‌ సీయస్‌ సంగీతం అందించిన ఈ పాటకు సిరాశ్రీ సాహిత్యం అందించగా హేమచంద్ర ఆలపించారు. ఈ పాటకు విశేష స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. రూ. 51 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మార్చి 19న, మోహన్‌ బాబు పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని అనుకుంటున్నారు. 

మరిన్ని వార్తలు