-

ఆ కథనంపై చలించిన సోనూసూద్‌

23 Jul, 2020 17:17 IST|Sakshi

కుల్దీప్‌ కుమార్‌ను ఆదుకునేందుకు ముందుకొచ్చిన సోనూ సూద్‌

మరోసారి సూపర్‌ హీరోగా సోనూ

సాక్షి, ముంబై: కరోనా వైరస్‌ సంక్షోభం నుంచి వలస కార్మికులను గట్టెక్కించేందుకు అవిశ్రాంతంగా పోరాడుతున్న బాలీవుడ్‌ నటుడు సోనూసూద్‌ మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. బిడ్డల స్మార్ట్‌ (ఆన్‌లైన్‌) చదువుల కోసం ఆవును అమ్ముకున్న వ్యక్తికి సాయం చేసేందుకు సూపర్‌హీరో ముందుకు వచ్చారు. స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేసేందుకు కుటుంబ జీవనాధారమైన  ఆవును అమ్ముకున్నాడన్న మీడియా కథనాలపై చలించిన సోనూ సూద్‌ సంబంధిత వ్యక్తికి ఆవును తిరిగి ఇచ్చేద్దాం..వివరాలు కావాలంటూ ట్విటర్‌ ద్వారా అభ్యర్థించారు. దీంతో సోనూపై నెటిజన్లు ‍ప్రశంసలు కురిపిస్తున్నారు.  (వారి కోసం సోనూసూద్ మరో గొప్ప ప్రయత్నం

కరోనా వైరస్,లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విధానం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల నెత్తిన మరింత భారాన్ని మోపుతోంది. హిమాచల్ ప్రదేశ్‌, జ్వాలాముఖిలోని గుమ్మర్ గ్రామానికి చెందిన కుల్దీప్ కుమార్ తన పిల్లలను చదువు కొనసాగించాలనుకుంటే స్మార్ట్‌ఫోన్ అవసరమని ఉపాధ్యాయులు తెగేసి చెప్పారు. దీంతో 500 రూపాయలు కూడా లేని కుమార్‌ 6 వేల స్మార్ట్‌ఫోన్‌ కొనలేక ఇబ్బంది పడ్డాడు. చివరికి బ్యాంకులను సంప్రదించినా ప్రయోజనం లేకపోయింది. తనకు ఆర్థిక సాయం చేయాల్సిందిగా పంచాయతీలో పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఎవరూ పట్టించు కోలేదు. ఇక చేసేదేమీలేక అతని ఏకైక ఆదాయ వనరు ఆవును అమ్మి మరీ 6 వేల స్మార్ట్‌ఫోన్‌ కొనివ్వడం పలువురిని కదిలిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన జ్వాలాముఖి ఎమ్మెల్యే రమేష్‌ ధవాలా కుల్దీప్‌ కుమార్‌కు ఆర్థిక సాయం చేయాలని అధికారులను ఆదేశించారు.  (పిల్లల కోసం ఆ కాస‍్త ఆసరా వదిలేశాడు!)

మరిన్ని వార్తలు