ఊరి దాహం తీర్చిన రియల్‌ హీరో సోనూసూద్‌

26 Feb, 2021 21:41 IST|Sakshi

లక్నో: కరోనా కాలం నుంచి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ రియల్‌ హీరోగా నిలుస్తున్న సోనూసూద్‌ మరో మంచి కార్యక్రమం చేసి అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఏళ్లుగా నీటి సమస్యతో బాధపడుతున్న గ్రామానికి మేలు చేశారు. వందలాది మంది ప్రజల దాహార్తి తీర్చారు. ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోని సమస్యను సోనూసూద్‌ పరిష్కరించడంతో ఆ గ్రామస్తులు కృతజ్ఞతలు చెబుతున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నీటి కోసం కొన్ని కిలోమీటర్లు వెళ్తున్నామని.. తమ గ్రామానికి సహాయం చేయాలని ఆ గ్రామస్తులు సోనూసూద్‌కు ట్విట్‌ చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులను అడిగినా స్పందన లేకపోవడంతో మిమ్మల్ని సంప్రదిస్తున్నామని ఆ గ్రామస్తులు చెప్పడంతో సోనూ స్పందించాడు. సూద్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు ఝాన్సీ గ్రామంలో బోర్‌ తవ్వించి నీటి వసతి కల్పించారు. చేతి పంపులను ఏర్పాటు చేయించాడు. దీంతో ఝాన్సీ గ్రామస్తులందరూ సోనూసూద్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు.

బోర్‌ తవ్వించిన వీడియోను సోనూ ట్విటర్‌లో షేర్‌ చేశారు. బోర్తు వేస్తుంటే ఆసక్తిగా గ్రామస్తులు గమనించడాన్ని తన మనసుకు హత్తుకుందని సోనూ పేర్కొన్నాడు. ఏదో ఒక రోజు ఆ గ్రామంలో ఆ నీళ్లు తాగేందుకు వెళ్తానని ప్రకటించాడు. ప్రస్తుతం సోనూ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. లాక్‌డౌన్‌ అనంతరం తెలుగులో అల్లుడు అదుర్స్‌ సినిమాలో సోనూ కనిపించాడు. ఇప్పుడు చిరంజీవి సినిమా ఆచార్యలో సోనూసూద్‌ నటిస్తున్నాడు.
 

మరిన్ని వార్తలు