పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ ఇవ్వనున్న సోనూ సూద్‌

12 Sep, 2020 18:58 IST|Sakshi

మెడిసిన్‌, ఇంజనీరింగ్‌తో సహా పలు కోర్సులు

ఫీజు, వసతి, ఆహారం అన్ని సమకూర్చుతాం

రియల్‌ హీరో సోనూ సూద్‌ మరో మంచి పనితో ముందుకు వచ్చారు. ఈ సారి పేద విద్యార్థులను ప్రోత్సాహించే కార్యక్రమాన్ని ప్రారంభించారు సోనూ సూద్‌. ఆయన తల్లి, ప్రొఫెసర్‌ సరోజ్‌ సూద్‌ పేరు మీదుగా పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించనున్నారు. scholarships@sonusood.me లో దరఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ప్రస్తుత కాలంలో విద్య ఎంత ఖరీదైన వనరుగా మారిందో చూస్తున్నాం. దాంతో చాలా మంది పేద కుటుంబాల్లోని తల్లిదండ్రులు తమ పిల్లల్ని ఉన్నత చదువులు చదివించలేకపోతున్నారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవ్వాలన్నా చాలా మంది విద్యార్థుల దగ్గర స్మార్ట్‌ఫోన్లు, టీవీలు లేవు. కొందరు ఫీజులు చెల్లించలేని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో  నేను దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలతో ఒప్పందం కుదుర్చుకున్నాను. ప్రతిభ గల పేద విద్యార్థులకు నా తల్లి పేరు మీద స్కాలర్‌షిప్‌ అందిస్తాను. మా అమ్మ గారు పంజాబ్‌ విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పారు. ఆమె స్ఫూర్తిని నేను కొనసాగించాలనుకుంటున్నాను’ అన్నారు. (చదవండి: మీకు 20 సార్లు ట్వీట్‌ చేశాను: సోనూ సూద్‌)

కోర్సులేంటి.. అర్హులేవరు..
‘మెడిసిన్, ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, సైబర్‌ సెక్యూరిటీ, డాటా సైన్స్, ఫ్యాషన్, జర్నలిజం, బిజినెస్ స్టడీస్ వంటి కోర్సులకు ఈ స్కాలర్‌షిప్ అందుబాటులో ఉంటుంది. 2 లక్షల రూపాలయ కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న కుటుంబాల విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు అప్లై చేసుకోవచ్చు. కానీ వారికి మంచి మార్కులు వచ్చి ఉండాలి. అలాంటి వారి ఫీజు, వసతి, ఆహారం అన్ని విషయాలను మేమే చూసుకుంటాం’ అన్నారు సోనూ సూద్‌.

మరిన్ని వార్తలు