విగ్రహం ఏర్పాటుపై సోనూసూద్‌ కామెంట్‌

22 Dec, 2020 14:22 IST|Sakshi

కరోనా లాక్‌డౌన్‌ కాలంలో కష్టాల్లో ఉన్న వారికి  విశేషమైన సేవలందించి రియల్‌ హీరోగా నిలిచారు బాలీవుడ్‌ నటుడు సోనూ సూద్‌. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన ఓ అభిమాని సోనూ సూద్‌కి విగ్రహం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సిద్ధిపేట జిల్లా మద్దూరు మండలం దుబ్బ తండా పరిధిలోని చెలిమితండాకు చెందిన రాజేష్‌ రాథోడ్‌కు సోనూసూద్‌పై ఉన్న అభిమానంతో తమ తండాలో సోనూ సూద్‌ కోసం విగ్రహాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే దేవతల మాదిరిగానే ప్రతిరోజు సోనూసూద్‌ విగ్రహానికి పూజలు చేస్తామని రాజేష్‌ తన సంతోషాన్నివ్యక్తం చేశారు. కాగా రాజేష్‌ సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడం గొప్ప విషయమని తండా వాసులు అభినందించారు. ఇక ఆదివారం స్థానికులు విగ్రహానికి పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. చదవండి: సోనూ సూద్‌కు ఓ విగ్రహం

కాగా, ఈ విషయం కాస్తా నటుడు సోనూసూద్‌కు చేరింది. దీనిపై ఆయన ట్విటర్‌ వేదికగా స్పందించారు. తనకు ఇలా విగ్రహం ఏర్పాటుచేయడం గౌరవంగా ఉందన్నారు. అయితే, ఇది తన స్థాయికి మించిన గౌరవమని, దీనికి తను అర్హుడును కాదని అన్నారు. విగ్రహం ఏర్పాటు చేసిన చోటుకు వెళ్లాలని ఉందని,  త్వరలోనే అక్కడకు వెళ్తానని పేర్కొన్నారు. రెండు చేతులు జోడించి గ్రామస్తులు చూపించిన ప్రేమ, గౌరవానికి కృతజ్ఞుడిని అని తెలిపారు. ఇక సినిమాల విషయానికొస్తే సోనూసూద్‌ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నాడు.

మరిన్ని వార్తలు