త‌మిళ మీడియాలో ఎస్పీ బాలు పోస్టులు వైర‌ల్

7 Sep, 2020 09:01 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, చెన్నై :  కోవిడ్-19తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌కుడు ఎస్పీ బాలసుబ్ర‌హ్మ‌ణ్యం త‌న 51వ వార్షికోత్స‌వాన్ని ఆసుప‌త్రిలో జ‌రుపుకున్న‌ట్లు స‌మాచారం. వైద్యుల స‌మక్షంలో, అన్ని జాగ్ర‌త్త‌ల న‌డుమ బాలు దంప‌తులు శ‌నివారం సాయంత్రం పెళ్లిరోజును జ‌రుపుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు ఎస్పీ బాలు స‌తీమ‌ణి సావిత్రి ఆసుప‌త్రికి వెళ్లార‌ని, ఐసీయూలోనే దంప‌తులు కేక్ క‌ట్ చేసిన‌ట్లు అక్క‌డి త‌మిళ మీడియా కొన్ని ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేసింది. దీంతో ఈ పోస్టులు వైర‌ల్‌గా మారాయి. డాక్ట‌ర్లు, ఐసీయూ సిబ్బంది న‌డుమ బాలు 51వ వివాహ వార్షికోత్స‌వాన్ని జ‌రుపుకున్న‌ట్లు సోష‌ల్ మీడియాలో ప‌లువురు పోస్టులు పెడుతున్నారు. అయితే దీనిని ఆసుప‌త్రి వ‌ర్గాలు కానీ, బాలు కుమారుడు ఎస్పీ చ‌ర‌ణ్ కానీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. (వైద్యం, ఫిజియోథెరపీకి స్పందిస్తున్నారు: ఎంజీఎం)

క‌రోనా సోక‌డంతో ఎస్పీ బాలు ఈ నెల 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో చేరి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తొలుత ఆయ‌న ఆరోగ్యం బాగానే ఉన్న‌ప్ప‌టికీ మ‌ధ్య‌లో కాస్త విష‌మించింది. దాంతో ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు.   బాలు ఆరోగ్య ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు ఆస్పత్రి వర్గాలు బులెటిన్‌ విడుదల చేస్తూ వచ్చాయి. అలాగే, ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ సైతం వీడియో సందేశాల ద్వారా సమాచారం అందిస్తున్నారు. గత వీడియోలో దేవుని ఆశీర్వాదంతో సోమవారం ఓ శుభవార్త వినబోతున్నారని చ‌ర‌ణ్ ప్ర‌క‌టించాడు. దీంతో ఎస్పీ బాలు ఆరోగ్యం పూర్తిగా కుదుట పడిందని, సోమవారం డిశ్చార్జి కాబోతున్నారని అభిమానులు ఆశిస్తున్నారు. (వచ్చే సోమవారం శుభవార్త వింటాం: ఎస్పీ చరణ్)

మరిన్ని వార్తలు