నాన్న పరిస్థితి ఇంకా విషమంగానే: ఎస్పీ చరణ్

24 Aug, 2020 13:34 IST|Sakshi

సాక్షి, చెన్నై : ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా వైరస్‌ను జయించినట్లు వచ్చిన వార్తలను ఆయన కుమారుడు ఎస్పీ చరణ్‌ ఖండించారు. ఎస్పీకి కరోనా నెగిటివ్‌ అంటూ వచ్చిన వార్తలు అవాస్తవమని, కొందరు తన పేరుతో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తన తండ్రి ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందన్నారు. ఎంజీఎం వైద్యులు ఎక్మోతో ఎస్పీ బాలుకి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. తన తండ్రి ఆరోగ్యంపై వివరాలను ఎప్పకటికప్పుడు తానే అందిస్తానని, ఏ విషయమైనా.. తన ద్వారానే తెలుస్తుందని సోషల్‌ మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. దయచేసి తప్పుడు ప్రచారం చెయ్యొద్దని విజ్ఞప్తి చేశారు.

కాగా, ఎస్పీ బాలు ఆరోగ్య పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతోందని, తాజాగా ఆయనకు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్‌ వచ్చిదంటూ ఎస్పీ చరణ్‌ పేరిట సోమవారం ఉదయం మీడియాకు ఓ ప్రకటన విడుదల అయింది. దీంతో ప్రపంచమంతా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆ వార్తలు పుకార్లంటూ ఎస్పీ చరణ్ ఖండించడంతో ఎస్పీ బాలు ఫ్యాన్స్‌ నిరాశ చెందారు. కాగా, ఈ నెల 5న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు కరోనా పాజిటివ్ తేలిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. 

మరిన్ని వార్తలు