నవరాత్రులు - సినిమాల్లో నారీమణులు: వెండితెరపై హీరోయిన్ల విలనిజం

1 Oct, 2022 13:41 IST|Sakshi

హీరోయిన్‌గా కెరీర్‌ని ప్లాన్ చేసుకోవడం ఎంత కష్టమో… కంటిన్యూ చేయడం కూడా అంతే కష్టం. అందులోనూ అసలు హీరోయిన్ లైఫ్ స్పాన్ ఐదారేళ్లు. అంతకు మించి కష్టం. ఇలా అన్ని వైపుల నుంచి ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన కెరీర్ అది. అలాంటిది…ఇంకా హీరో యిన్‌గా కంటిన్యూ అవుతూనే విలనిజం వైపు ఒక లుక్ వేయడం అంటే చిన్న విషయం కాదు. సాహసమనే చెప్పాలి. ఇలాంటి సాహసాలు చేసి శభాష్ అనిపించుకునే తారమణులూ ఉన్నారు. 

అటు గ్లామర్ పాత్రల్లోనూ, ఇటు ఫెర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్రల్లోనూ సత్తా చాటిన నటి రమ్య కృష్ణ. చంద్రలేఖలో కోమాలో ఉన్నపేషెంట్ పాత్ర నుంచి, బాహుబలిలో శివగామి దాకా అద్భుతంగా చేసిన క్యారెక్టర్స్ చాలానే ఉన్నాయి. కానీ… నరసింహాలో నీలాంబరి పాత్ర మాత్రం చాలా ప్రత్యేకం. ఫుల్ నెగిటివ్ రోల్ క్యారెక్టర్ అది. పైగా రజినీకాంత్‌తో  ఢీ అంటే ఢీ అనే పాత్ర. ఆ క్యారెక్టర్‌లో రమ్యకృష్ణ జీవించింది. నరసింహ అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ ఘన విజయం సాధించింది. ఆ సక్సెస్‌లో రజినీకాంత్‌తో సమాన వాటా రమ్యకృష్ణది కూడా. నీలాంబరి అన్న పేరుకే ఒక సీరియస్ అటెన్షన్ ఇచ్చేసింది తన నటనతో. చాలా కాలం పాటు ఆ పేరు బ్రాండ్‌గా నిలిచింది.

టాలీవుడ్‌లో దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని ఎంజాయ్ చేసిన అతి తక్కువ హీరోయిన్స్‌లో సౌందర్య ఒకరు. తెలుగులో టాప్ హీరోలందరితోనూ సౌందర్య నటించింది. అటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది సౌందర్య. హీరోయిన్‌గా కెరీర్ కొనసాగు తున్న సమయంలోనే… నెగిటివ్ రోల్ ప్లే చేసింది సౌందర్య. నా మనసిస్తా రా చిత్రంలో శ్రీకాంత్ , రిచా హీరో, హీరోయిన్లుగా నటిస్తే…విలన్‌గా సౌందర్య యాక్ట్ చేసింది. నెగిటివ్ రోల్ లోనూ మంచి మార్కులను కొట్టేసింది. 

మహేశ్‌ బాబు హీరోగా, తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం చిత్రంలో విలన్గా గోపిచంద్ నటించారు. దేవుడు పాత్రలో గోపిచంద్ ప్రదర్శించిన విలనీజం అప్పట్లో పెద్ద సంచలనమైంది. గోపిచంద్‌తో పాటుగా ఉంటూ అతను చేసే ప్రతి పనికి సహకరిస్తూ ఉంటుంది రాశి. హీరోయిన్ పాత్రల నుంచి లేడీ విలన్ క్యారెక్టర్లోకి రాశి జంప్ చేయడంపై కాస్త డిస్కషన్ కూడా సాగింది. మల్లి పాత్రలో గ్లామర్‌కు క్రూరత్వం మిక్స్ చేసి సిల్వర్ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసింది రాశి.

మరిన్ని వార్తలు