Sri Simha: ఆయనతో సినిమా చేయాలన్నది నా డ్రీమ్‌: శ్రీ సింహా

22 Sep, 2022 10:04 IST|Sakshi

‘‘సర్వైవల్‌ థ్రిల్లర్స్‌ హాలీవుడ్, బాలీవుడ్‌లో వచ్చినప్పుడు మనం ఎంజాయ్‌ చేస్తుంటాం. ఈ తరహా జానర్‌ సినిమా తెలుగులో కూడా వస్తే బాగుంటుందనే ఫీలింగ్‌తో ‘దొంగ లున్నారు జాగ్రత్త’ సినిమా చేశాం. ఈ చిత్రం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు శ్రీ సింహా. సతీష్‌ త్రిపుర దర్శకుడిగా పరిచయం అవుతూ శ్రీ సింహా కోడూరి, ప్రీతి అస్రాని హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. డి. సురేష్‌బాబు, సునీత తాటి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 23న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా బుధవారం విలేకర్ల సమావేశంలో శ్రీ సింహా చెప్పిన విశేషాలు.

కథ చాలా గ్రిప్పింగ్‌గా అనిపించడంతో విన్న వెంటనే ఈ సినిమా ఒప్పుకున్నాను. సినిమా నిడివి కూడా రెండు గంటలలోపే ఉంటుంది. ఓ దొంగ తన తప్పులను తాను ఎలా తెలుసుకున్నాడు? అనే అంశాలను దర్శకుడు ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడు. రెగ్యులర్‌ లొకేషన్స్‌లో అయితే వీలైన విధంగా కెమెరాలు పెట్టొచ్చు. కానీ సినిమా ఎక్కువ భాగం కారులోనే ఉంటుంది. ఇందుకు తగ్గట్లుగా షూటింగ్‌ చేసేందుకు కొన్ని వర్క్‌ షాప్స్‌ చేశాం.

► కెమెరామేన్‌ యశ్వంత్‌ అద్భుతంగా షూట్‌ చేశారు. సతీష్‌ బ్రిలియంట్‌ డైరెక్టర్‌. చెప్పింది చెప్పినట్లు తీశారు. సర్వైవల్‌ థ్రిల్లర్‌ కాబట్టి బ్యాగ్రౌండ్‌ స్కోర్‌కు మంచి స్కోప్‌ ఉంది. మా అన్నయ్య కాలభైరవ మంచి మ్యూజిక్‌ ఇచ్చారు.  

► రాజమౌళిగారితో సినిమా చేయాలన్నది నా డ్రీమ్‌. ప్రస్తుతం నా స్థాయి ఏంటో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేయాలని ఇప్పుడే ఆశించడం లేదు. నా తర్వాతి చిత్రం ‘భాగ్‌ సాలే’ పూర్తయింది. ‘ఉస్తాద్‌’ షూటింగ్‌ జరుగుతోంది.  

మరిన్ని వార్తలు