RRR Team In Oscars 2023: ఈవెంట్‌లో వారికి మాత్రమే ఉచితం.. టికెట్స్ కొన్న రాజమౌళి!

19 Mar, 2023 15:13 IST|Sakshi

లాస్‌ ఎంజిల్స్‌లో జరిగిన 95 ఆస్కార్ వేడుకల్లో టాలీవుడ్‌ కీర్తిని రెపరెపలాడించిన ఘనత దర్శకధీరుడు రాజమౌళిదే. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటించిన ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు పాటకు ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డ్ దక్కింది. అయితే ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు ఆయన కుటుంబసభ్యులు కూడా హాజరయ్యారు. కానీ ఈవెంట్‌లో పాల్గొనేందుకు ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి ఉచితంగా ఎంట్రీ ఇవ్వలేదని సమాచారం. కేవలం సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు మాత్రమే ఉచితంగా ప్రవేశం కల్పించినట్లు తెలుస్తోంది. 

రాజమౌళితో సహా మిగిలిన చిత్రబృంద సభ్యులు కూడా ఈవెంట్‌లో పాల్గొనేందుకు టికెట్ కొనుగోలు చేయాల్సిందే. ఈ వేడుకల్లో రాజమౌళితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా పాల్గొన్నారు. అలాగే ఈ సినిమా హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్, ఉపాసన, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కూడా పాల్గొన్నారు. అయితే ప్రతిష్ఠాత్మకమైన ఈవెంట్‌లో పాల్గొనేందుకు చిత్రబృందానికి అన్ని టికెట్లను రాజమౌళి కొనుగోలు చేశారు.

తాజా నివేదికల ప్రకారం రాజమౌళి ఒక టిక్కెట్ కోసం సుమారు  $25 వేల డాలర్లను వెచ్చించారు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.20.6 లక్షలు. అయితే ఈవెంట్‌లో ఎస్ఎస్ రాజమౌళితో సహా చిత్రబృందాన్ని వెనుక వరుసలో కూర్చోబెట్టినందుకు అకాడమీ విమర్శలపాలైంది. అకాడమీ నిర్వాహకుల తీరు పట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్కార్ అవార్డ్ గెలిచిన తర్వాత చిత్రబృందం మార్చి 17న హైదరాబాద్‌కు  రాగా ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం లభించింది. 

కాగా.. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన  ఆర్ఆర్ఆర్ చిత్రంలో కొమురం భీమ్‌ పాత్రలో ఎన్టీఆర్,జూనియర్ ఎన్టీఆర్, పోలీసు అధికారి పాత్రలో రామ్ చరణ్ పాత్రలలో నటించారు. ఈ చిత్రంలో అలియా భట్, అజయ్ దేవగన్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ, ఒలివియా మోరిస్, శ్రియా శరణ్ కూడా కీలక పాత్రలు పోషించారు.

మరిన్ని వార్తలు