బాహుబలి చిత్రంతో భారత దేశంలోనే నెంబర్ వన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు దర్శకధీరుడు రాజమౌళి. తన కెరీర్ మొదట్లో పడిన కష్టాల గురించి ఓ విద్యాసంస్థలో జరిగిన ఈవెంట్లో జక్కన్న ఓపెన్ అయ్యాడు. తనకు చదువు అంతగా రాలేదని.. తన చిన్నప్పటి నుంచి సినిమా తప్ప మరో ప్రపంచం తెలియదని తెలిపాడు. అయితే తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ అప్పటికే సినీ ఇండస్ట్రీలో ఉండడంతో అన్ని క్రాఫ్ట్స్లోనూ పని చేశానని చెప్పాడు. ఒక దర్శకుడికి అన్ని క్రాఫ్ట్స్లోనూ పట్టుండాలనే కసితో అన్నీ నేర్చుకున్నట్లు చెప్పాడు రాజమౌళి.
అయితే మద్యలో ఒక టైమ్లో తనకు పైసా సంపాదన లేని సమయంలో తన భార్య రమా రాజమౌళి జీతం మీద బతికానని ఆమెనే తనని పోషించిందని ఆయన పేర్కొన్నాడు. అలా చెప్పుకోవడానికి తనకు సిగ్గేయడం లేదని సంతోషంగా ఉందని చెప్పాడు. తాను దర్శకుడు కాకముందు తన పనల్లా పొద్దున్నే భార్య రమాను ఆఫీస్లో డ్రాప్ చేసి కధలు, డైలాగ్స్ రాసుకోవడం, మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకు రావడం అని ఇది మా లవ్స్టోరీ అని జక్కన్న తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.
అలాంటి పరిస్థితుల నుంచి ఈ రోజు భారత దేశం గర్వించదగ్గ దర్శకుడిగా మారాడు జక్కన్న. ఇక ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా 'ఆర్ ఆర్ ఆర్' చిత్రం జనవరి 7, 2022న విడుదలకు సిద్దమౌతున్న విషయం తెలిసిందే.