ఆ క్రెడిట్‌ నా ఒక్కడిదే కాదు: తమన్

23 Mar, 2021 11:18 IST|Sakshi

‘‘ఒక సినిమాలో పాటలన్నీ హిట్‌ అయ్యాయంటే ఆ క్రెడిట్‌ సంగీత దర్శకుడు ఒక్కడిదే కాదు.. పాటల రచయిత, సింగర్స్, డైరెక్టర్స్, నిర్మాత.. ఇలా అందరికీ ఆ క్రెడిట్‌ దక్కుతుంది. ఓ సినిమా బ్లాక్‌ బస్టర్‌ అయిందంటే ఆ క్రెడిట్‌ కూడా 24 క్రాఫ్ట్స్‌ వారిది.. ఎవరి పని వారు బాగా చేస్తేనే సినిమా హిట్‌ అవుతుంది’’ అని సంగీత దర్శకుడు తమన్‌  అన్నారు. పవన్‌ కల్యాణ్‌ హీరోగా, శ్రుతీహాసన్, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల ఇతర పాత్రల్లో నటించిన చిత్రం ‘వకీల్‌ సాబ్‌’. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. బోనీ కపూర్‌ సమర్పణలో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 9న విడుదలకానుంది.

ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు తమన్‌ హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ–‘‘మ్యూజికల్‌ సక్సెస్‌ అనేది చాలా రేర్‌గా వస్తుంది. ‘అల వైకుంఠపురములో’ పాటలన్నీ బాగా పాపులర్‌ అయ్యాయి.. కరోనా కారణంగా ఆ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్‌ చేయలేకపోయాను. లాక్‌డౌన్‌ తర్వాత వచ్చిన ‘సోలో బతుకే సో బెటర్, క్రాక్‌’ సినిమాలు అటు మ్యూజికల్‌గానూ, ఇటు సినిమాపరంగానూ మంచి హిట్టయ్యాయి. పవన్‌ కల్యాణ్‌గారి ‘గబ్బర్‌ సింగ్‌’ సినిమాకి నేను సంగీతం అందించాల్సింది.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదు. ఇప్పుడు ‘వకీల్‌ సాబ్‌’కి కుదిరింది. ‘దిల్‌’ రాజుగారికి త్రివిక్రమ్‌గారు చెప్పడంతో ‘వకీల్‌ సాబ్‌’ అవకాశం వచ్చింది. ఈ సినిమాలోని ‘మగువా మగువా, సత్యమేవ జయతే, కంటిపాప’ పాటలకు మంచి స్పందన రావడం సంతోషంగా ఉంది. ‘మగువా మగువా..’ పాటని చిరంజీవిగారు కూడా వాళ్ల అమ్మతో షేర్‌ చేసుకోవడం హ్యాపీ. నేపథ్య సంగీతం ఇంకా హైలెట్‌ అవుతుంది. నేను చేసిన ‘టక్‌ జగదీష్‌’, బాలకృష్ణ–బోయపాటి శ్రీను సినిమాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ప్రస్తుతం చిరంజీవి ‘లూసిఫర్‌’ రీమేక్, పవన్‌ కల్యాణ్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుం’ రీమేక్, మహేశ్‌బాబు ‘సర్కారువారి పాట’ సినిమాలకు సంగీతం అందిస్తున్నాను’’ అన్నారు. 
చదవండి:
నువ్వు చూస్తున్నావని తెలుసు: నవీన్‌ పొలిశెట్టి ఎమోషనల్‌
సర్కారు వారిపాట: మహేశ్‌కి తండ్రిగా సీనియర్‌ హీరో

మరిన్ని వార్తలు