'వచ్చే జన్మలో కూడా నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా'

17 May, 2021 15:48 IST|Sakshi

ముంబై: ప్రముఖ డ్యాన్సర్‌, నటి సుధాచంద్రన్ తండ్రి, ప్ర‌ముఖ న‌టుడు కేడీ చంద్ర‌న్ (84) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో మే 12న ముంబ‌యిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన గుండెపోటు రావడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు.  ‘హ‌మ్ హయిన్ ర‌హీ ప్యార్ కే’, ‘చైనా గేట్’, ‘తేరే మేరే స‌ప్నే’, ‘హ‌ర్ దిల్ జో ప్యార్ క‌రేగా’, ‘కోయీ మిల్ గయా’ తదిత‌ర చిత్రాలతో నటుడిగా కేడీ చంద్ర‌న్ గుర్తింపు సంపాదించుకున్నారు. గుల్మోహ‌ర్ అనే టీవీ షోతోనూ ప్రేక్ష‌కుల్ని అల‌రించారు. తండ్రి మరణంతో సుధాచంద్రన్‌ దుఖఃసాగరంలో మునిగిపోయింది.

తండ్రి ఫోటోను షేర్‌ చేస్తూ.. 'మళ్లీ కలిసేవరకు గుడ్‌బై అప్పా. నీ కూతురిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. నువ్వు నేర్పించిన సూత్రాలు, నియమాలను నా చివరి శ్వాస వరకు పాటిస్తానని మాటిస్తున్నాను. వచ్చే జన్మలో కూడా నీ కూతురిగానే పుట్టాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నా' అంటూ ఎమోషనల్‌ అయ్యారు.ఇక కేడీచంద్ర‌న్ మృతి పట్ల పలువురు బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్య‌క్తం చేశారు. కాగా 'మయూరి' సినిమాతో సుధాచంద్రన్ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన సంగతి తెలిసిందే. భరతనాట్యం డ్యాన్సర్​ అయిన సుధాచంద్రన్​ తన డ్యాన్స్‌తో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇదే క్రమంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో నటించారామె. ప్రస్తుతం పలు టీవీ సీరియళ్లలో నటిస్తున్నారు. 

A post shared by Sudhaa Chandran (@sudhaachandran)

చదవండి : ఇలా జరుగుతుందని ఊహించలేదు: నటుడు ఎమోషనల్‌
నానమ్మ కోరిక నెరవేర్చలేకపోయా: హీరో

మరిన్ని వార్తలు