Keerthy Suresh: స్టార్‌ డైరెక్టర్‌తో మూవీ చేయనున్న మహానటి!

13 Aug, 2022 13:57 IST|Sakshi

ఇరుది సుట్రు చిత్రంతో వెలుగులోకి వచ్చిన మహిళా దర్శకురాలు సుధా కొంగర. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించగా సంచలన విజయం సాధించింది. తెలుగులో వెంకటేష్‌ హీరోగా గురు పేరుతో రీమేక్‌ చేశారు. అక్కడ కూడా విశేష ప్రేక్షకాదరణ అందుకుంది. తదుపరి సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు తెరకెక్కించారు. ఎయిర్‌డెక్కన్‌ సంస్థ అధినేత గోపీనాథ్‌ జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. విమర్శకులను సైతం మెప్పించింది. ఐదు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది.

ప్రస్తుతం సుధా కొంగర ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. నెక్ట్స్‌ ఏంటి అన్న ప్రశ్నకు ఈమె గత నెల ఏప్రిల్‌లోనే బదులిచ్చారు. సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్‌ చిత్ర నిర్మాణ సంస్థలో సుధా కొంగర చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. అయితే దీనికి సంబంధించిన అప్‌డేట్‌ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇది హీరోయిన్‌ ఓరియంటెడ్‌ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నటి కీర్తి సురేష్‌ కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే కీర్తి సురేష్‌కు హీరోయిన్‌ సెంట్రిక్‌ చిత్రాల నటిగా మంచి పేరు ఉంది. మహానటి చిత్రంతో తానేంటో నిరూపించుకుని జాతీయ ఉత్తమనటి అవార్డును సైతం గెలుచుకుంది. ఇటీవల తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో సెంట్రిక్‌ కథా చిత్రంలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్‌ దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో నటించడం నిజమైతే, ఆమెను ఎలాంటి పాత్రలో చూపించనున్నారు? చిత్ర కథ ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో నెలకొంది.  

మరిన్ని వార్తలు