మహేశ్‌ చెప్పింది ఈ మూవీతో నెరవేరుతుందనుకుంటా

23 Aug, 2021 08:00 IST|Sakshi

‘‘సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబుగారి బ్యాగ్రౌండ్‌ ఉండి కూడా తనను తాను నిరూపించుకోవడానికి కష్టపడుతున్నారు సుధీర్‌బాబు. యాక్టింగ్, బ్యాడ్మింటన్, క్రికెటర్, ఫైటర్, డ్యాన్సర్‌.. ఇలా ప్రతి దాంట్లో నిరూపించుకుంటున్న సుధీర్‌ని ఆల్‌ రౌండర్‌ అంటాను. ‘భలే మంచి రోజు, యాత్ర, ఆనందో బ్రహ్మ’.. ఇప్పుడు ‘శ్రీదేవి సోడా సెంటర్‌’.. ఇలా వినూత్న సినిమాలు నిర్మిస్తున్న విజయ్, శశిలకు నా అభినందనలు’’ అని అన్నారు దర్శకుడు అనిల్‌ రావిపూడి. సుధీర్‌బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణకుమార్‌ దర్శకత్వంలో విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మించిన చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌’.

ఈ నెల 27న ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ మాట్లాడుతూ – ‘‘రిస్క్‌ తీసుకోవడానికి భయపడని సుధీర్‌లాంటి వ్యక్తులంటే నాకు ఇష్టం. విజయ్, శశి ప్యాషనేట్‌ ప్రొడ్యూసర్స్‌’’ అన్నారు. ‘‘చిరంజీవిగారు ప్రమోట్‌ చేసిన నా ‘సమ్మోహనం’ హిట్‌. ఇప్పుడు ఈ సినిమా ప్రమోషన్‌ ఆయనతో ఆరంభమైంది. అందుకే చిరంజీవిగారు నాకు లక్కీ హ్యాండ్‌.

‘సుధీర్‌కు కరెక్ట్‌ సినిమా పడితే కెరీర్‌లో నెక్ట్స్‌ లెవల్‌కు వెళతాడు’ అని ఓ సందర్భంలో మహేశ్‌ అన్నారు. ఆ సినిమా ఇదే అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు సుధీర్‌బాబు. ‘‘చాన్స్‌ ఇచ్చిన సుధీర్, విజయ్, శశిలకు థ్యాంక్స్‌’’ అన్నారు కరుణకుమార్‌. ‘‘పలాస’ చూసినప్పుడే కరుణకుమార్‌తో సినిమా చేయాలనుకున్నాం. సినిమా బాగా వచ్చింది. బిజినెస్‌ బాగా జరిగింది’’ అన్నారు విజయ్, శశి. కార్తికేయ, అజయ్‌ భూపతి, తమ్మారెడి భరద్వాజ, రాజ్‌ కందుకూరి తదితరులు పాల్గొన్నారు. 

చదవండి : మహిళల రక్షణకు దిశ యాప్ ఎంతో ఉపయోగపడుతుంది: అడవి శేషు 
నా జీవితంలో జరిగినవే సినిమాలో చూపించా: డైరెక్టర్‌ 

మరిన్ని వార్తలు