రామ్‌చరణ్‌తో ఆ సీన్‌ చెప్పడానికి భయపడ్డా: సుకుమార్‌

6 May, 2021 17:26 IST|Sakshi

క్రియేటీవ్‌ దర్శకుడు సుకుమార్‌- రామ్‌ చరణ్‌ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ హిట్‌ చిత్రం ‘రంగస్థలం’. 2018 మార్చి 30న విడుదలైన ఈ సినిమా.. టాలీవుడ్‌ రికార్డులన్నీ బద్దలుకొట్టింది. రామ్‌చరణ్‌ కెరియర్‌లోనే ఈ చిత్రం ఓ మైలురాలుగా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. చిట్టిబాబు పాత్రలో రామ్‌చరణ్‌ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. పల్లెటూరి యువతి రామలక్ష్మిగా సమంత, రంగమ్మత్తగా అనసూయ, కుమార్‌ బాబుగా ఆది పినిశెట్టి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్‌ పాత్రకు సంబంధించి సుకుమార్‌ ఓ ఇంట్రెస్టింగ్‌ కామెంట్‌ చేశాడు.

రంగస్థలం స్ర్కిప్ట్‌ రామ్‌చరణ్‌కు ఎంతగానో నచ్చిందని, కథ చెప్పిన వెంటనే ఓకే చెప్పేశాడని తెలిపాడు. అయితే ఇందులో ఓ సన్నివేశం గురించి వివరించడానికి చాలా భయపడ్డానని చెప్పారు. అదేంటంటే..'ప్రకాశ్‌ రాజ్‌ ఆసుపత్రిలో ఉన్నప్పుడు అన్ని సపర్యలు చేయాల్సి ఉంటుంది. గడ్డం గీయడం దగ్గర్నుంచి, బట్టలు మారచడం ఆఖరికి టాయిలెట్‌ బ్యాగ్‌ కూడా తీయాల్సి ఉంటుంది. ఈ లైన్‌ గురించి చెప్పేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. కానీ రామ్‌చరణ్‌ మాత్రం చేసేద్దాం అంటూ కూల్‌గా ఆన్సర్‌ ఇచ్చారు.

ఆయన వద్ద నుంచి ఈ ఆన్సర్‌ ఎక్స్‌పెక్ట్‌ చేయలేదు. టెన్షన్‌ పడుతూనే ఈ సీన్‌ను వివరించా. కానీ చరణ్‌ దాన్ని అర్థం చేసుకున్నారు. ఒక నటుడిగా ఉండాల్సిన లక్షణం అది. ఏ పాత్రనైనా చేయగలగాలి. రామ్‌చరణ్‌ వందకు వంద శాతం తన పాత్రకు జస్టిస్‌ చేశారు' అని సుకుమార్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం రామ్‌చరణ్‌ ఆచార్య మూవీతో పాటు, ఆర్‌ఆర్‌ఆర్‌లో నటిస్తుండగా, సుకుమార్‌ పుష్ప సినిమాను తెరకెక్కిస్తున్నారు.

చదవండి : యాంకర్‌ అనసూయ భర్త జాబ్‌ ఏంటో తెలుసా?
రామ్‌ చరణ్‌ను ఢీ కొట్టే విలన్‌గా కన్నడ స్టార్‌!

మరిన్ని వార్తలు