డబ్బులు ఉంటే అలాంటి పాత్రలు రావు..దేవుడి పర్మిషన్‌ ఉండాలి: సుమన్‌

24 Dec, 2022 18:55 IST|Sakshi

డబ్బులు, పలుకుబడి ఉంటే ఆధ్యాత్మికమైన పాత్రలు రావు..అలాంటి పాత్రలు చేయాలంటే  పై నుంచి ఆ దేవుడి పర్మిషన్ కావాలి. అన్నమయ్య సమయంలోనూ నా పాత్ర కోసం చాలా మందిని అడిగారు. కానీ ఆ వెంకటేశ్వరుడి స్వామి నన్ను మాత్రం కావాలని అనుకున్నాడు. అందుకే ఆ పాత్ర నాకు వచ్చింది’అని సీనియర్‌ నటుడు సుమన్‌ అన్నారు. సుదర్శనం ప్రొడక్షన్స్ లో  లయన్ డా. సాయివెంకట్ స్వీయ దర్శకత్వం లో నటిస్తున్న చిత్రం ‘జయహో రామానుజ ’. సాయిప్రసన్న ప్రవలిక నిర్మాతలుగా వ్యవహరిస్తున్న  ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ తాజాగా హైదరాబాద్‌లో జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సుమన్‌ మాట్లాడుతూ.. సాయి వెంకట్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి బంధం ఉంది. రామానుజం పాత్రను పోషిస్తున్నట్టుగా చెప్పారు. ఎలా ఉంటుందో అని అనుకున్నాను. అయితే ఫస్ట్ లుక్ చూసిన తరువాత నాకు కాన్ఫిడెంట్ అనిపించింది. కారెక్టర్‌కి గెటప్ బాగా సూట్ అయితే సినిమా బాగా వస్తుంది. రామానుజం పాత్రకు సాయి వెంకట్ గెటప్ బాగా సెట్ అయింది. ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

దర్శక నిర్మాత సాయి వెంకట్ మాట్లాడుతూ..  ఈ సినిమాకు బాహుబలి, బింబిసార రేంజ్‌లో వీఎఫ్ఎక్స్ ఉంటుంది. చిన్న వాళ్లు సినిమా తీస్తే ఎవ్వరూ అంచనాలు పెట్టుకోరు. మనల్ని మనమే నిరూపించుకోవాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. మాలాంటి వారు తీసిన చిన్న సినిమాను రిలీజ్ చేయడం చాలా కష్టం. ఈ సినిమాను టెక్నికల్‌పరంగా, బిజినెస్ పరంగా తీశాను.  ఫిబ్రవరిలో ఈ సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నాం’ అన్నారు. 

‘జయహో రామానుజ సినిమా చిత్రం మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’అని  ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ బసి రెడ్డి అన్నారు. ‘ట్రైలర్ చాలా బాగుంది. సినిమా యూనిట్‌కు ఆల్ ది బెస్ట్’అని తెలుగు ఫిలిం ఛాంబర్ జనరల్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ అన్నారు. ‘ఇలాంటి గొప్ప చిత్రాన్ని తీసిన సాయి వెంకట్‌కు మా కృతజ్ఞతలు' అని ప్రొడ్యూసర్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్  అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ జో శర్మ, సింగర్, నిర్మాత సాయి ప్రసన్న , బీసీ కమీషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు