అనాథ చిన్నారులను ఆదుకుంటానన్న యంగ్‌ హీరో

4 May, 2021 13:03 IST|Sakshi

కంటికి కనిపించని కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్‌ దేశంలోకి ప్రవేశించినప్పటి నుంచి అటు జనాలకు, ఇటు ప్రభుత్వాలకు కంటిమీద కనుకు లేకుండా చేసింది. ఆర్థిక వ్యవస్థను, అమయాకుల జీవితాలను ఛిన్నాభిన్నం చేసింది. ఎంతోమందిని ఈ వైరస్‌ పొట్టనపెట్టుకోవడంతో అభం శుభం తెలియని చిన్నారులు అనాధలుగా మారారు. వారి ఆలనాపాలనా, భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో కోవిడ్‌తో కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులకు ఉచిత విద్య అందించాలని ఇటీవలే నటుడు సోనూసూద్‌ ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. కానీ దీనిపై ఎటువంటి సమాధానం రాలేదు. తాజాగా టాలీవుడ్‌ హీరోహీరోయిన్లు సందీప్‌ కిషన్‌, శృతి హాసన్‌  కోవిడ్‌ కారణంగా కన్నవారికి దూరమైన వారిని ఆదుకునేందుకు నడుం బిగించారు.

ఆలనా పాలనా మాత్రమే కాదు..: సందీప్‌ కిషన్‌
'దురదృష్టవశాత్తూ కరోనా వల్ల కుటుంబాన్ని కోల్పోయిన చిన్నారులు ఎవరైనా ఉంటే నాకు తెలియజేయండి. వారి వివరాలను sundeepkishancovidhelp@gamil.comకి పంపించండి. నేను, నా టీమ్‌ వారికి ఆహారాన్ని అందించడంతో పాటు సంరక్షణ బాధ్యతలను దగ్గరుండి చూసుకుంటాం. అలాగే కొన్నేళ్ల పాటు విద్యను అందిస్తాం.. ఈ కష్ట సమయంలో అందరం ఒకరికొకరు తోడుగా నిలబడటం అత్యంత అవసరం. కాబట్టి మీరు కూడా మీ పరిసరాల్లో కష్టాల్లో ఉన్నవారికి తోచినంత సహాయం చేయండి' అని పేర్కొంటూ సందీప్‌ కిషన్‌ ట్వీట్‌ చేశాడు.

వారిని మంచి మనుషుల చేతులో పెడదాం..: శృతీహాసన్‌
"అందరికీ నమస్కారం..  కోవిడ్‌ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పరిస్థితి ఏంటి? అని అందరూ అడుగుతున్నారు. వారికి ఏమీ కాదు, ఆ చిన్నారులను కాపాడాల్సిన బాధ్యత మన మీదుంది. అందుకు ఒక పరిష్కారమార్గం ఉంది. 1098 హెల్ప్‌లైన్‌ నంబర్‌ను సంప్రదించండి. వారిని మంచి మనసున్నవారికి దత్తతివ్వండి" అని శృతీ హాసన్‌ పేర్కొంది.

A post shared by Shruti Haasan (@shrutzhaasan)

చదవండి: A1 Express: ఓటీటీ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

మరిన్ని వార్తలు