ఏ1 ఎక్స్‌ప్రెస్‌ ట్రైలర్‌: ఈ సారి కప్పు మనదే!

26 Jan, 2021 17:25 IST|Sakshi

హీరో సందీప్‌ కిషన్‌, హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఏ1 ఎక్స్‌ప్రెస్‌. తెలుగులో హాకీ మీద వస్తున్న తొలి చిత్రమిదేనని హీరో గతంలోనే ప్రకటించగా ఇందులో 'సింగిల్‌ కింగులం' పాట యువతచెవుల్లో ఇప్పటికీ మోగుతూనే ఉంది. గణతంత్ర దినోత్సవ సందర్భంగా మంగళవారం ఈ సినిమా ట్రైలర్‌ రిలీజైంది. వందేమాతరం అన్న నినాదంతో మొదలైన ఈ ట్రైలర్‌లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత్‌ ప్రపంచ హాకీ కప్‌ గెలిచిందన్న విషయాన్ని ప్రస్తావించారు. అదే సమయంలో ప్రభుత్వం హాకీని జాతీయ క్రీడగా ప్రకటించిందని పేర్కొన్నారు. ఇక ఈ సారి కప్పు మనమే కొడుతున్నామని ట్రైలర్‌లో రావు రమేష్‌ ధీమాగా చెప్తున్నాడు. ఆ కప్పు కొట్టే సత్తా హీరోకు ఒక్కడికే ఉన్నట్లుగా అతడి ఎంట్రీ చూపించారు. (చదవండి: రవితేజ గురించి ఈ నిజాలు తెలుసా?)

అయితే కప్పు మాత్రమే కాదు, తనకు తప్పనిపిస్తే మనుషులను కూడా కొడతానని నిరూపిస్తున్నాడు సందీప్‌ కిషన్‌. సింగిల్‌ కింగులం.. అని పాడిన హీరో లావణ్య త్రిపాఠి అంటే ఇంట్రస్ట్‌ లేదంటూనే ఆమెతో ముద్దుల్లో మునిగిపోయాడు. మరోవైపు ఆటగాళ్లకు ఈ దేశంలో కనీస గౌరవం లేకుండా పోయిందని బాధను వెళ్లగక్కుతూనే, స్పోర్ట్స్‌ ఎప్పుడో బిజినెస్‌గా మారిపోయిందన్న చేదునిజాన్ని చెప్పుకొచ్చాడు. ఎలాగైనా గెలవాలన్న కసి హీరోలో కనిపిస్తుండగా అతడిని ఓడించాలని చూస్తున్నట్లున్నాడు రావు రమేష్‌. మరి ఈ ఇద్దరి మధ్య జరిగే పోరాటంలో ఎవరు గెలుస్తారో? సినిమా రిలీజైతే కానీ చెప్పలేం.

డెన్నిస్‌ జీవన్‌ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టీజీ విశ్వప్రసాద్‌, అభిషేక్‌ అగర్వాల్‌, సందీప్‌ కిషన్‌, దయా పన్నెం నిర్మిస్తున్నారు. రావు రమేష్, మురళీశర్మ, పోసాని కృష్ణ మురళి, ప్రియదర్శి, సత్య, మహేష్ విట్టా, పార్వతీశం, అభిజిత్, భూపాల్, ఖయ్యూమ్, సుదర్శన్, శ్రీ రంజని, దయ, గురుస్వామి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. హిప్‌హాప్‌ తమిజ సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 12 రిలీజ్‌ చేస్తున్నట్లు సమాచారం (చదవండి: ఇద్దరి మధ్య 18 ఏళ్ల వ్యత్యాసం.. అయితే ఏంటి?)

మరిన్ని వార్తలు