Super Star Krishna : ఫామ్‌హౌస్‌లో కాకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు ఎందుకు చేశారంటే..

17 Nov, 2022 17:20 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ కృష్ణ మరణం టాలీవుడ్‌ను శోకసంద్రంలోకి నెట్టివేసింది. వెండితెరపై 350కు పైగా సినిమాల్లో  వైవిధ్య పాత్రలతో అలరించిన ఆయన తెలుగు తెరపై చెరగని ముద్ర వేసుకున్నారు.  గుండెపోటుతో హాస్పిటల్‌లో చేరిన ఆ  నటశేఖరుడు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు నిన్న(బుధవారం) జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ముగిశాయి.

కృష్ణ కుమారుడు మహేశ్‌ బాబు ఆయనకు తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలను నిర్వహించారు. అయితే దిగ్గజ నటుడికి సొంతంగా వారి ప్రైవేట్‌ స్థలంలో కాకుండా మహాప్రస్థానంలో అంత్యక్రియలు చేయడంపై అభిమానులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాజాగా ఈ విషయంపై ‍కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందించారు. ఇలా చేయడానికి ఓ కారణం ఉందని.. కృష్ణ సతీమణి ఇందిరా దేవి అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు నిర్వహించామని, రమేష్‌ బాబు అంత్యక్రియలు కూడా అక్కడే చేసినట్లు తెలిపారు.

మరోవైపు సూపర్‌ స్టార్‌ కృష్ణ  జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ఆయన పేరు మీద ఒక మెమోరియల్ ఏర్పాటు చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మెమోరియల్‌లో కృష్ణ కాంస్య విగ్రహంతో పాటు ఆయన నటించిన 350 సినిమాలకు సంబంధించిన ఫోటోలు, షీల్డ్‌లు, ఇతర వివరాలను ప్రజలకు అందుబాటులో ఉంచనున్నారు.త్వరలోనే దీనిపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు