సాక్షి, చెన్నై: అగ్ర కథానాయకుడు రజనీకాంత్ తన అభిమాన సంఘం మక్కల్మండ్రం కార్యదర్శులతో సోమవారం భేటీ కానున్నారు. రాజకీయాల్లోకి వస్తానని చెబుతూ వచ్చిన రజనీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. అనారోగ్య సమస్యల కారణంగా రాజకీయాల్లోకి రావడం లేదని ప్రకటించారు. సినిమాలపై దృష్టి పెట్టారు. అన్నాత్తై షూటింగ్ ముగించారు. ఇటీవల వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్లి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మండ్రం జిల్లా కార్యదర్శులతో రజనీ భేటీకి నిర్ణయించడం ప్రాధాన్యతకు దారి తీసింది. జిల్లాల వారీగా నేతలకు శనివారం ఆహ్వానాలు వెళ్లాయి. సోమవారం ఉదయం 9 గంటలకు రాఘవేంద్ర కల్యాణ మండపంలో సమావేశం జరగనుంది.